అందరూ జగన్మోహన్ రెడ్డిని సాధారణ రాజకీయ నాయకుడు అనుకుంటారు. కానీ కాదు… ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే ప్రత్యేకంగా పుట్టిన కారణ జన్ముడు.
తిరుమల శ్రీవారు ఏడు కొండలపై వెలసినట్లే, కాలం కలిసొస్తే జగన్ కూడా రుషికొండపై ఉండేవారే! కానీ కుదర్లే! అందుకే తాడేపల్లిలో ప్యాలస్ కట్టుకొని ఉంటున్నారు.
తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులు వైకుంఠ కాంప్లెక్స్ క్యూలైన్లో వెళ్ళి ఉచితంగా దర్శించుకోవచ్చు. కానీ జగన్ దర్శనం చాలా దుర్లభం.
ఆయన తతనంతత తాను పరామర్శల యాత్రలలో సాక్షాత్కరించినప్పుడే అందరూ దర్శించుకోవాలి… జేజేలు పలకాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి చూసోస్తామంటే ఆయనేమీ చంద్రబాబు నాయుడు కాదు… పవన్ కళ్యాణ్ అంతకంటే కాదు.
కనుక తాడేపల్లి ప్యాలస్ దర్శనం, సేవలకు కొందరికే అనుమతి లభిస్తుంది. ఇప్పుడు కొత్తగా వీఐపీ పాసులు కూడా జారీ చేస్తున్నారు.
అలాగని అవేమీ తెల్ల రేషన్ కార్డులు కావు… అడిగిన వారందరికీ పంచిపెట్టేయడానికి! ఎంపిక చేసిన కొంత మందికే పాసులు లభిస్తాయి. వాటికీ సజ్జల వంటి శల్య సారధుల రికమండేషన్ అవసరమేమో… తెలీదు!
ఏది ఏమైనప్పటికీ, జగన్ మాత్రం రాజకీయాలలో ‘ట్రెండ్ సెట్టర్’ అని చెప్పక తప్పదు. మూడు రాజధానులు, రివర్స్ టెండరింగ్, రుషికొండ-రాజధాని, శాసనసభ-ప్రధాన ప్రతిపక్షహోదా, ఇప్పుడు తాజాగా తన దర్శనానికి వీఐపీ పాసులు జారీ చేయడం వంటి గొప్ప గొప్ప ఆలోచనలన్నీ ఆయనకు మాత్రమే ఎలా వస్తాయో…. పాపం చంద్రబాబు నాయుడు వంటివారికి కూడా అర్దం కాదంటే అతిశయోక్తి కాదు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనకు ఇంత చిన్న విషయం కూడా తెలియదు కనుకనే పొలం గట్ల వద్ద, వీధుల్లో, బస్సుల్లో తిరుగుతూ ప్రజలకు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఉచిత దర్శనం ఇచ్చేస్తుంటారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి 14 నెలలు అయ్యింది. ఈ 14 నెలల్లో ఎంత లేదన్నా వందకు పైగానే సభలలో పాల్గొని ఉంటారు. కానీ ఇంత వరకు ఒక్క చెట్టు కూడా నరికించలేకపోయారంటే ఆయన ఎంత వెనకబడిపోయారో అర్ధం చేసుకోవచ్చు!
మేధావుల ఆలోచనలను సామాన్యులు ఎవరూ అర్ధం చేసుకోలేరు. అందుకే జగన్ దర్శనానికి వీఐపీ పాసులు జారీ చేస్తే మంత్రి నారా లోకేష్ కూడా దానిని అర్ధం చేసుకోలేక, “ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ…. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! అంటూ అయోమయపడిపోయారు.
ఏం చేస్తాం… జగన్మోహన్ రెడ్డి వంటి కారణజన్ముడి లీలలు అర్ధం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు… ప్రభుత్వం కూడా. అది వారి దురదృష్టమే తప్ప అయన తప్పు ఎలా అవుతుంది?






