ఆస్తుల కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు సంక్షేమ పధకాలతో ఎంతో మేలు చేశానని చెప్పుకోవడం చూస్తుంటే ‘అమ్మకి అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నట్లే అనిపిస్తుంది.
ఎన్నికలలో వైసీపీ ఓటమి, కేసులు, ముఖ్య నేతల అరెస్టులు సరిపోవన్నట్లు తల్లి, చెల్లితో ఆస్తుల పంచాయితీ పెట్టుకొని జగన్ మరో కొత్త సమస్య సృష్టించుకున్నారు.
‘సరస్వతి పవర్’ వాటాలు తల్లి విజయమ్మకి బదిలీ చేస్తూ గతంలో తాను, తన భార్య భారతి రెడ్డి చేసిచ్చిన గిఫ్ట్ డీడ్ అమలుచేయకుండా నిలిపివేయాలని కోరుతూ జగన్ దంపతులు ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడంతో వారి కుటుంబంలో ఈ ఆస్తుల పంచాయితీ బయటకు పొక్కింది.
ఆ తర్వాత విజయమ్మ, షర్మిల ఇద్దరూ జగన్ తమని మోసం చేస్తున్నాడని, తమని కోర్టుకు కూడా ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ వేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ గురువారం విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ‘సరస్వతి పవర్’ వాటాల బదిలీ ప్రక్రియ నిలిపివేసి యధాతధ స్థితిని కొనసాగించాలనే జగన్ దంపతుల అభ్యర్ధనని తిరస్కరించింది.
జగన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడంతో విజయమ్మ కూడా కౌంటర్ పిటిషన్ వేయక తప్పలేదు. దానిలో ఆమె ‘సరస్వతి పవర్’లో తనకు మాత్రమే 99.75 శాతం వాటాలున్నాయని స్పష్టం చేశారు. తన పిల్లాలిద్దరికీ ఆస్తుల గొడవలు ఉన్నాయని, వాటితో ‘సరస్వతి’కి ఎటువంటి సంబంధం లేదని ఆమె ట్రిబ్యునల్కు తెలియజేశారు.
ఈ ఆస్తుల పంచాయితీ మళ్ళీ తెరపైకి వచ్చింది కనుక షర్మిల కూడా నేడు మీడియా ముందుకు వచ్చి తన అన్న జగన్మోహన్ రెడ్డి ఏవిదంగా తమని మోసం చేశాడో, తనని, తల్లిని కోర్టుకీడ్చి ఏవిదంగా వేధిస్తున్నాడో మళ్ళీ పూసగుచ్చిన్నట్లు వివరించక మానరు.
తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని పట్టుబడుతున్న జగన్ కూటమి ప్రభుత్వంతో పోరాడవలసి ఉండగా, ఆస్తుల కోసం సొంత తల్లి, చెల్లితో ఈవిదంగా పోరాటాలు చేస్తున్నారు.
శాసనసభ సమావేశాలకు హాజరు కావలసిన జగన్, వైసీపీ నేతలను పరామర్శించేందుకు జైలుకి వెళ్ళి వస్తున్నారు.
కోడికత్తి, పాస్ పోర్టు కేసులలో కోర్టుకి వెళ్ళేందుకు నామోషీగా భావిస్తున్న జగన్, ఆస్తుల కోసం కోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు.
నీతి నిజాయితీ, విలువలు, విశ్వసనీయత అంటూ మాట్లాడే జగన్ తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చేoదుకు వెనకాడలేదు.
వైసీపీకి ఇటువంటి నాయకుడు, విజయమ్మకు ఇటువంటి కొడుకు, షర్మిలకు అన్న లభించారు. అది వారి అదృష్టమో దూరదృష్టమో వారికే తెలియాలి.
కానీ తల్లి, చెల్లితో ఈవిదంగా వ్యవహరిస్తున్న జగన్, ఎటువంటి రక్త సంబంధం లేని రాష్ట్ర ప్రజల కోసం ఆరాటపడుతున్నారంటే నమ్మశక్యంగా ఉంటుందా?కనుక జగన్ ఆరాటం పదవీ అధికారం కోసమేనని వేరే చెప్పాలా?






