వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి యాత్రలకు అర్ధాలు ఎప్పుడు వేరుగానే ఉంటాయి. వైసీపీ పార్టీ తొలినాళ్లలో తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి మరణం కారణంగా చేసిన ఓదార్పు యాత్ర మొదలుకుని ఇప్పుడు తాజాగా చిత్తూరు జిల్లా పర్యటన వరకు జగన్ యాత్రలకు బయటకు కనిపించే ప్రచారం ఒకటైతే పార్టీ అంతర్గతంగా వినిపించే వార్తలు మరొకలా ఉంటాయి.
నాడు వైస్ మరణంతో మొదలైన వైస్ జగన్ బలప్రదర్శన యాత్రలకు వైసీపీ ఒక్కో సందర్భంలో ఒక్కో పేరు పెట్టుకుంటూ రాజకీయం చేస్తుంది. నాటి ఓదార్పే, 2019 ప్రజా సంకల్ప యాత్ర గా మారితే, ఇక ఇప్పుడు 2024 లో పరామర్శలుగా రూపాంతరం చెందింది.
అయితే నాడు ఓదార్పు కి, నేటి పరామర్శల కు వైసీపీ వెనకున్న నిగూడార్థం అధికారం. నాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించడానికి నేడు కూటమి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించడానికి వైస్ జగన్ ముందున్న అంతిమ లక్ష్యం అధికారం.
నాడు కాంగ్రెస్ పార్టీది ‘కుట్ర’ అంటూ రాజకీయం చేసారు, నేడు కూటమి ప్రభుత్వానిది ‘కక్ష్య’ అంటూ రాజకీయం చేస్తున్నారు. నాడు వైఎస్ఆర్ అభిమానులే టార్గెట్ గా ముందుకెళితే నేడు వైసీపీ సానుభూతి పరులే లక్ష్యంగా అడుగులేస్తున్నారు.
2024 లో పార్టీ ఓడిన నాటి నుంచి బెంగళూర్ కేంద్రంగా ప్రణాళికలు రచిస్తున్న జగన్ అంధ్రప్రదేశ్ టార్గెట్ గా పని మొదలుపెట్టారు. నాటి నుంచి నేటి వరకు వైసీపీ నేతలను అరెస్టు చేసారంటూ ఒకసారి జైలు యాత్రలు చేసిన జగన్, మరోసారి పార్టీ కార్యర్తలను చంపేశారు అంటూ ఓదార్పు యాత్రలు చేసారు.
ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలి అంటూ ఒకసారి, గంజాయి ముఠాలను శిక్షించకూడదు అంటూ మరొకసారి ఇలా ఎదో ఒక కారణంతో రోడ్ల మీదకు రావడం, ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదు అంటూ పార్టీ కార్యకర్తలను రెచ్చకొట్టడం, అనుమతులు లేకుండా పర్యటనలు చేస్తూ ప్రభుత్వ అధికారులను బెదిరించడం,
ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, రాష్ట్రంలో అలజడిని, అశాంతిని క్రియాట్ చేయడం ఇవన్నీ వైసీపీ రాజకీయ వ్యూహాలలో భాగాలే. అయితే ఈ యాత్రలన్నిటి కి ప్రజా సంక్షేమం కోసం జగన్ పర్యటనలు అంటూ వైసీపీ ప్రచారం కల్పిస్తుంటే,
అసలు వాస్తవానికొస్తే, 151 నుంచి 11 కి పడిన పార్టీని తిరిగి నిలబెట్టుకోవడానికి, పార్టీ క్యాడర్ లో ప్రజలలో, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలుగా భావించవచ్చు. అందుకే వైస్ జగన్ యాత్రాలకు అర్ధాలు వేరులే అనే అభిప్రాయం ఏపీ రాజకీయాలలో గట్టిగా ప్రచారం జరుగుతుంది.
అయితే నేడు తాజాగా వైస్ జగన్ చిత్తూరు పర్యటనకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం లోని మామిడి రైతులను పరామర్శించేందుకు ఎల్లుండి జగన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
ఇందుకు గాను జగన్ తో పాటుగా మరో 500 మంది కి అధికారులు అనుమతినిచ్చారు. అలాగే జగన్ పర్యటించబోతున్న మామిడి యార్డ్ విస్తీర్ణం చిన్నది కావడంతో ఎలాంటి ర్యాలీలు, రోడ్డు షో లకు అనుమతిలేదంటూ వైసీపీ కి ఆదేశాలిచ్చారు. మొన్న జగన్ పొదిలి, తెనాలి ఘటనల దృష్ట్యా ఈ నిబంధనలు అమలులో ఉంటాయంటూ పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
అయితే జగన్ అధికారుల ఆదేశాలను పాటిస్తూ వచ్చిన పని చేసుకుని, రైతులను పరామర్శించి ప్రభుత్వాన్ని విమర్శించి తిరిగి వెళతారా.? లేక గత పర్యటనల మాదిరే రప్ప రప్ప అంటూ రెచ్చకొడతారా.? లేక పార్టీ కార్యకర్తల ప్రాణాలతో రాజకీయం చేస్తారా.?
ఏదేమైనా జగన్ పర్యటనలు అంటే ముందుగా భయపడాల్సింది వైసీపీ కార్యకర్తలే కావడం ఇక్కడ కొసమెరుపు. ఒకసారి జగన్ మెప్పు కోసం రప్ప రప్ప పోస్టర్లతో రెచ్చిపోయిన క్యాడర్ జైలుకెళితే, మరోసారి జగన్ కారు కింద పడి సింగయ్య అనే కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు.




