
పదవి, అధికారం చేతిలో ఉన్నప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు తమంతటి వారు లేరనుకుంటారు. తాము ఏం చెపితే ప్రజలు అదే నిజమని నమ్మేస్తారని అనుకుంటారు. ఆ భ్రమ వల్లనే ప్రజలందరూ తమ వైపే ఉన్నారనుకుంటారు.
Also Read – పొదిలి ఘటన: వైసీపీ 2.0 కి జస్ట్ శాంపిల్.?
ఒకవేళ వారికి అటువంటి భ్రమ లేకపోయినా వారి చుట్టూ ఉండే ‘బాజా బజంత్రీ మేళాలు’ ప్రజలు మనవైపే ఉన్నారని నమ్మిస్తుంటారు. కనుక ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామని జగన్లాగ గుడ్డిగా నమ్ముతుంటారు. తప్పులు చేస్తూనే ఉంటారు.
ఇటువంటి భ్రమల కారణంగా ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన వారిని చూసి అధికారంలో ఉన్నవారు సంతోషంగా నవ్వుకుంటారే తప్ప రేపు తమకీ అదే గతి పట్టవచ్చనే ఆలోచన, భయం ఉండకపోవడం ఇంకా విశేషం.
Also Read – అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం
కేసీఆర్, చంద్రబాబు నాయుడు, జగన్ ముగ్గురూ ఈవిదంగా ఎదురుదెబ్బలు తిన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేతిలో పదవి, అధికారం ఉన్నాయి కనుక ఆయన కూడా ఈ ‘భ్రమ దశ’లో ఉన్నారనుకోవచ్చు.
వీరిలో చంద్రబాబు నాయుడు ఈ దశలని ఛేదించి మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కనుక మళ్ళీ తప్పులు పునరావృతం కాకుండా చాలా జాగ్రత్తగా మెసులుకుంటూ, పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ అదుపు తప్పకుండా చూస్తున్నారు.
Also Read – ఇప్పుడు ఇద్దరికీ జైల్లో లైవ్ షో?
జగన్ ఓ సారి అధికారం రుచి చూశారు. కానీ ఆ గుడ్డి భ్రమల కారణంగా అధికారం కోల్పోయారు. కనుక తీవ్ర అసహనంతో ఉన్నారు.
అందుకే “అధికార పార్టీ నేతలు కొడితే కొట్టించుకోండి. పోలీసులు కేసులు పెడితే పెట్టించుకోండి. కానీ అన్నీ పద్దు వ్రాసి పెట్టుకోండి. అధికారంలోకి రాగానే ఇంతకు ఇంతా వడ్డీతో సహా తీర్చేద్దాం,” అని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు చెపుతున్నారు.
ఇది కొంచెం అతిగా అనిపిస్తున్నప్పటికీ, వైసీపీకి వేరే గత్యంతరం లేదు కనుక ధైర్యంగా ఎదుర్కోమని చెపుతూనే ప్రతీకారం తప్పదని జగన్ స్పష్టం చేస్తున్నారని అర్దమవుతూనే ఉంది.
ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అనేక కేసులు నమోదు చేయిస్తోంది. అవన్నీ అక్రమ కేసులు కావని, వైసీపీలో అవినీతికి పాల్పడిన వారు మాత్రమే కేసులలో చిక్కుకుంటున్నారు. మిగిలినవారు బాగానే ఉన్నారు. కానీ వీటిని రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులుగా జగన్ అభివర్ణిస్తూ, ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్నారు.
కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నందున, జగన్ బెదిరింపులను తాటాకు చప్పుళ్ళుగా కొట్టిపడేస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత దయనీయ స్థితిలో ఉన్న ఆంధ్రాని మళ్ళీ గాడిన పెట్టి, అమరావతి, పోలవరం నిర్మాణాలు చేపట్టి, రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు రప్పించి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు నాయుడుని ప్రజలు గద్దె దించుతారని ఎవరైనా అనుకున్నారా?లేదు.
అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన జగన్ని ప్రజలు గెలిపిస్తారని ఎవరైనా అనుకున్నారా?లేదు. కానీ గెలిపించారు.
2019 ఎన్నికలలో ఈ రెండు విడ్డూరాలు జరిగాయి. 2024 ఎన్నికలలో అధికారం ఏవిదంగా తారుమారు అయ్యిందో అందరూ చూశారు.
2014-19లో సిఎం చంద్రబాబు నాయుడు జగన్ జోలికి పోలేదు. కానీ జగన్ అధికారంలోకి రాగానే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ నేతలందరికీ నరకం చూపించారు.
ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు ఆయన జోలికి వెళ్ళి, కేసులు నమోదు చేయిస్తున్నారు. దానికి ఇంతకు ఇంత ప్రతీకారం తీర్చుకుంటానని జగన్ హెచ్చరిస్తూనే ఉన్నారు. కనుక వస్తే తప్పకుండా అదే చేస్తారు.
కనుక జగన్ బెదిరింపులను తాటాకు చప్పుళ్ళుగా కొట్టిపడేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికే ప్రమాదం.