జగన్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పధకాలను కూటమి ప్రభుత్వం మరింత మెరుగుపరిచి అమలు చేస్తే మా పధకాలను కాపీ కొడుతున్నారని వైసీపీ విమర్శిస్తుంటారు.
జగన్ ప్రభుత్వం అమలుచేయని కొత్త పధకాలు అమలు చేస్తుంటే కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నట్లు అవి చాలా లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శిస్తుంటారు. అంటే ఎన్నికల హామీలు అమలు చేసినా చేయకపోయినా విమర్శిస్తూనే ఉంటారన్న మాట!
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీశక్తి’ పధకాన్ని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి పేరిట వైసీపీ సోషల్ మీడియాలో పెట్టిన లేఖ ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
‘జగన్ పేరిట లేఖ’ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే తెలుగులో నాలుగు ముక్కలు తప్పులు లేకుండా తడబడకుండా మాట్లాడలేని జగన్, ఈ పధకంలో లోపాలు ఎత్తిజూపుతూ తెలుగులో రెండు పేజీల లేఖ వ్రాయగలరా? అంటే కాదనే చెప్పవచ్చు.
సరే ప్రభుత్వం తరపున గవర్నర్ లేదా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లే, జగన్ తరపున వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఈ లేఖ విడుదల చేశారని సరిపెట్టుకుందాము.
కానీ స్త్రీశక్తి వంటి కొత్త పధకం ఆలోచన కూడా కలగని జగన్మోహన్ రెడ్డి ఈ పధకంపై విమర్శించడం అవసరమా?అనిపిస్తుంది.
నాన్ స్టాప్ బస్సులలో ఈ పధకం వర్తింపజేయకపోవడాన్ని జగన్ తప్పు పట్టారు. బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తేనే మహిళలు లక్షాధికారులు అయిపోయినట్లు కూటమి ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలకు లక్షల రూపాయలు పంచిపెట్టానంటూ లేఖలో ఆ లెక్కలు చెప్పారు.
స్త్రీశక్తి పధకంపై రాష్ట్రంలో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా?అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే, రోజువారి పనులకు బయటకు వెళ్ళే మహిళలకు ఇది చాలా ఊరట కల్పిస్తోంది. కనుక ఆ మేరకు తమకు ఖర్చు తగ్గిందని సంతోషిస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణించ గలుగుతున్నారు కూడా. కనుక మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ జగన్ చెప్పినట్లు నాన్ స్టాప్, లగ్జరీ, వొల్వో బస్సులలో కూడా ఈ పధకం అమలు చేస్తే ఆర్టీసీపై పెను భారం పడుతుంది. అప్పుడు ఆ భారాన్ని పురుషులకు బదిలీ చేయక తప్పదు.
ఒకవేళ టికెట్ ఛార్జీలు పెంచితే అప్పుడూ వైసీపీ విమర్శిస్తుంది. ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నాలు కూడా చేస్తుంది.
కనుక కూటమి ప్రభుత్వం ఎవరిపై అదనపు భారం మోపకుండా ఉన్నంతలో ఈవిదంగా సర్దుబాటు చేసి ఈ పధకం అమలు చేస్తున్నందుకు సంతోషించాలి.
వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకునేందుకు అప్పులు చేసి, ప్రభుత్వ ఆస్తులు తాకట్లు పెట్టి మరీ తెచ్చి పప్పు బెల్లాలు పంచినట్లు డబ్బులు పంచిపెట్టి రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించారు. కానీ సొంత తల్లి, చెల్లిని ఆస్తుల కోసం కోర్టుకీడ్చిన జగన్, తన ఆస్తిలో లక్షల కోట్లు తెచ్చి రాష్ట్రంలో మహిళలకు పంచిపెట్టిన్నట్లు గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు.
జగన్ చేసిన అప్పుల భారాన్ని కూటమి ప్రభుత్వం నెత్తిమీద మోస్తూనే, ఇన్ని సంక్షేమ పధకాలు కూడా అమలుచేస్తోంది. ఇందుకు సంతోషించకపోగా కోడిగుడ్డుకి ఈకలు పీకుతుండటం సిగ్గుచేటు. చాలా హాస్యాస్పదంగా ఉంది.





