విలనిజంతో కూడిన ‘జై’ పాత్రతో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ టీజర్, డిజిటల్ వ్యూస్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. మొదటి 24 గంటలు గడిచే పాటికి మురుగదాస్ – మహేష్ బాబుల ‘స్పైడర్’ నెలకొల్పిన 6.3 మిలియన్ వ్యూస్ రికార్డులను 20 గంటల లోపే తుడిచిపెట్టి సరికొత్త రికార్డులు సృష్టించాడు. మొదటి 24 గంటలు గడిచే సమయానికి యూ ట్యూబ్ మరియు ఫేస్ బుక్ మాధ్యమాల ద్వారా “జై లవకుశ” దాదాపుగా 9 మిలియన్ క్లిక్స్ ను సొంతం చేసుకుకుంది.
పెద్ద సినిమా టీజర్ విడుదలవుతున్న ప్రతి సారీ పాత రికార్డులు ఆటోమాటిక్ గా అప్ డేట్ అవుతుండడంతో, ‘జై’ పాత్ర ద్వారా ఎన్టీఆర్ సృష్టించిన రికార్డులను తదుపరి అందుకునే హీరో ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. బరిలో ఆగష్టు 9న విడుదల కాబోతున్న మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ ప్రధానంగా ఉండగా, ‘బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టే సినిమాగా కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్న శంకర్ – సూపర్ స్టార్ రజనీకాంత్ ల ‘రోబో 2.0’ టీజర్ ఖచ్చితంగా కొట్టేస్తుందని అంతా భావిస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే… తనకు తానే శత్రువు అన్నట్లుగా… ‘జై’ పాత్ర తర్వాత ‘లవ’కు సంబంధించి, ‘కుశ’కు సంబంధించి కూడా మరో రెండు టీజర్లు విడుదల కానున్నాయి. ‘జై’ అంటే విలనిజంతో కూడుకుని సరికొత్త అనుభూతిని పంచడంతో ముక్తకంఠంతో అందరూ ప్రశంసల వర్షం కురిపించడంతో, రికార్డులు దాసోహం అన్నాయి. మరి ‘జై’ తెచ్చిపెట్టిన భారీ అంచనాలను ‘లవ,’ ‘కుశ’లు అందుకోగలుగుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అందుకుంటే మాత్రం… యూ ట్యూబ్ మాదిరే బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయం..!



