దసరా బరిలో నిలిచిన రెండు పెద్ద సినిమాలు “జై లవకుశ, స్పైడర్”లకు సంబంధించిన ఆడియోలు ఆయా హీరోల అభిమానులను, సంగీత, సాహిత్య ప్రియులను పూర్తిగా నిరాశపరచడంలో విజయవంతం అయ్యాయి. ‘జై లవకుశ’కు సంబంధించి నాలుగు పాటలున్న ఆడియో విడుదల కాగా, ఒక్క పాట మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ‘స్పైడర్’లో రెండు పాటలు విడుదల కాగా, ఈ రెండూ కూడా శ్రోతలను నిరాశపరిచాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు అభిమానుల మధ్య ‘ఆల్బమ్’ యుద్ధం జరుగుతోంది.
‘జై లవకుశ’ పాటల కంటే పర్వాలేదని ‘స్పైడర్’ ఫ్యాన్స్ అంటుంటే, ‘స్పైడర్’ పాటలు వచ్చిన తర్వాత ‘జై లవకుశ’ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని యంగ్ టైగర్ ఫ్యాన్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో సాగే ఈ పోరాటానికి అంతం ఉండదులేండి! ఇక, ‘స్పైడర్’ పూర్తి ఆల్బమ్ విడుదల కాకపోయినా, హరీష్ జయరాజ్ అందించిన సంగీతం వింటుంటే… ఈ సినిమా పాటలపై ఆశలు వదులుకోవాల్సిందే… అన్న క్లారిటీనైతే ఇచ్చేసాడు. దీంతో ఈ రెండు ఆల్బమ్స్ కూడా “దొందూ… దొందే…” అన్న చందంగా తయారయ్యాయి.
కామెడీగా మారిన మరో అంశం ఏమిటంటే… దేవిశ్రీప్రసాద్ తన పాత ట్యూన్స్ నే అటు తిప్పి ఇటు తిప్పి “జై లవకుశ”కు అందించి తారక్ ఫ్యాన్స్ పైకి వదలగా, హరీష్ జయరాజ్ తానేమీ తక్కువ కాదంటూ, తన పాత ట్యూన్స్ ను మెలితిప్పి మహేష్ ఫ్యాన్స్ పైకి వదిలారు. బహుశా వారి వారి పాత పాటలను వారు మరిచిపోయి మళ్ళీ ట్యూన్స్ కట్టేసారేమో గానీ, తెలుగు ప్రేక్షకులు మరువలేదన్న విషయం ఈ సందర్భంగా తెలిసి వచ్చింది. పాటల్లో సరిజోడి అనిపించుకున్న ఈ రెండూ సినిమాలు, టీజర్స్ లో మాత్రం ‘యంగ్ టైగర్’దే పైచేయి అనిపించుకుంది.


