జూనియర్ ఎన్టీఆర్ – బాబీల కాంబోలో ఈ నెల 21న విడుదల కాబోతోన్న “జై లవకుశ” సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన అన్నింటిలో ‘జై’ పాత్ర పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హైలైట్ అంటే ‘జై’ మాత్రమే అనిపించే విధంగా సాగిన ప్రమోషన్స్ లో తాజాగా ‘లవ’ కూడా వచ్చి చేరాడు. ‘జై లవకుశ’ ఆడియో ఆల్బమ్ లో ఉన్న నాలుగు పాటలకు సంబంధించిన వీడియో సాంగ్స్ టీజర్స్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
ఈ నాలుగు వీడియో సాంగ్స్ లో విజువల్ గా బెస్ట్ అని చెప్పాలంటే లవ ఆలపించిన ‘ట్రింగ్ ట్రింగ్’ అనే పాట వీక్షకులను మెప్పిస్తోంది. పాట చిత్రీకరించిన విధానం, ఎన్టీఆర్ డ్యాన్సింగ్ మూవ్ మెంట్స్ అదిరిపోయాయి. దీంతో వీడియో సాంగ్స్ లో ‘లవ’ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అయితే విడుదలైన నాలుగింటిలో రెండు పాటలు ‘జై’ పాత్రకు సంబంధించి ఉండడం విశేషం. ‘రావణా’ అనేది బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కాగా, నివేద థామస్ తో ‘నీ కళ్ళలోనా’ అనే మెలోడీ సాంగ్ ను వేసుకున్నాడు.
ఇక ‘కుశ’ పాత్రకు సంబంధించి ‘జంతర్ మంతర్ జాదు నేనై దోచేస్తా’ అంటూ తన క్యారెక్టర్ ను వివరించే పాట విజువల్ గురించి చెప్పుకోవడానికేం లేదు. మిగిలిన అయిదవ పాట త్వరలో విడుదల కానుండగా, ఐటెం సాంగ్ గా తెరకెక్కనున్న ఈ పాటలో తమన్నాతో కలిసి స్టెప్పులు వేయనున్నాడు తారక్. చాలా అద్భుతమైన డ్యాన్సింగ్ మూమెంట్స్ తో ‘నెవర్ బిఫోర్’ అనిపించే విధంగా ఈ పాట చిత్రీకరణ జరుపుకుంటోందని ప్రముఖ రచయిత కోన వెంకట్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. మరి తమన్నాతో స్టెప్పులు వేసే భాగ్యం ‘జై లవకుశ’లలో ఎవరికి దక్కనుందో..!


