జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మొట్టమొదటి ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నారు. బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ వారికి ఏడు పార్లమెంట్ సీట్లు, 35 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. దీనితో జనసేన పార్టీ నికరంగా 140 శాసనసభ సీట్లు, 18 ఎంపీ సీట్లలో పోటీకి నిలిచినట్టు అయ్యింది. ఇప్పటివరకూ 64 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. మొత్తం అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నారు.
అయితే జనసేనకు ఈ సారి మెగా ఫ్యామిలీ పరంగా పెద్దగా మద్దతు ఉన్నట్టు కనిపించడం లేదు. ఒక్క నాగబాబు మాత్రమే సోషల్ మీడియాలో తనకు తోచిన విధంగా కొన్ని వీడియోలతో సపోర్టు చేస్తున్నారు. (నాగబాబు వీడియోలు కొన్ని పార్టీకి చేటు చేస్తున్నాయి అని కొందరు అంటున్నారు అది వేరే విషయం). నాగబాబు ను నరసాపురం నుండి ఎంపీ గా దింపుతారని వార్తలు వచ్చినా అవేమీ జరగలేదు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పార్టీకి కోటి రూపాయిల విరాళం ఇచ్చేసి పక్కకు తప్పుకున్నారు.
గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న చిరంజీవి ఈ సారి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్నికలకు దగ్గరలో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగినా చిరంజీవి దూరంగానే ఉండిపోయారు. యువ హీరోలు – అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఎప్పుడన్నా మీడియా కదిలిస్తే జనసేన గురించి మాట్లాడారు గానీ వారూ పార్టీకి ఆంటీ ముట్టనట్టే ఉంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ఒంటరి యుద్ధం చేస్తున్నట్టే.ఒకవేళ వచ్చే నెల 11న జరగబోయే ఎన్నికలలో జనసేనకు అనూహ్యమైన ఫలితాలు ఏమైనా వస్తే అప్పుడు ఈ పరిస్థితిలో ఏమైనా మార్పు ఉంటుందేమో చూడాలి.



