ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్వరలో ‘జనసేన’ అధినేతగా పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాలలో పాల్గొంటానని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పాటు వచ్చే ఎన్నికల బరిలో ఖచ్చితంగా ‘జనసేన’ పార్టీ ఉంటుందని చెప్పిన పవన్, ఎన్ని స్థానాలలో అనేది ఇప్పుడే చెప్పలేమని మాట దాటవేశారు. కానీ నేడు గాంధీ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణాలలో కలిపి మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తామని, మన బలం ఎంత ఉందో అంతే స్థాయిలో పోటీ చేస్తామని పవన్ చెప్పినట్లుగా… జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా నుండి పోస్ట్ వచ్చింది.
అయితే మరికాసేపటికే ఆ ట్వీట్ మాయమైంది. తాము పోటీచేసే అసెంబ్లీ నియోజక వర్గాల అంశంలో ‘జనసేన’ ఇచ్చిన ఆ క్లారిఫికేషన్ తో రాజకీయ వర్గాలలో తప్పుడు సంకేతాలు వెళ్ళడంతో వెంటనే సదరు ట్వీట్ మటుమాయం అయ్యింది. దీంతో యధావిధిగా సోషల్ మీడియాకు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యాడు. ‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ అన్న చందంగా, ప్రస్తుతం చడిచప్పుడు లేకుండా సినిమాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్, ఓ రాజకీయ వేదికపై అట్టహాసంగా ప్రకటించాల్సిన అంశాన్ని, ఓ సాధారణ ట్వీట్ మాదిరి చేయడం విస్మయానికి గురి చేసింది.
దీంతో పొలిటికల్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చలు జరిగాయి. ట్వీట్ ను అయితే డిలిట్ చేయగలిగారు, సదరు ట్వీట్ ద్వారా చేసిన ప్రకటనకు పవన్ కళ్యాణ్ ఎప్పుడోకప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అసలే రాజకీయాలలో ఓనమాలు… దీనికి తోడు ఇలా తప్పటడుగులు వేయడం అనేది పాజిటివ్ సంకేతాలను తీసుకెళ్ళే అంశం కాదు. బహుశా తాను అన్ని స్థానాలలో పోటీ చేయను అన్న ఉద్దేశాన్ని గాంధీ జయంతి వేడుకగా ప్రజలందరికీ మరోసారి తెలియజెప్పాలని భావించారేమో..!?


