తెలంగాణలో ఎన్నికలలో బీజేపీతో పెట్టుకొని జనసేన 8 స్థానాలలో పోటీ చేస్తోంది. కనుక పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు, ఎప్పటిలాగే వేలాదిమంది ఆయన అభిమానులు సభలకు తరలివస్తున్నారు. ప్రధాన పోటీదారులైన బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జనసమీకరణ చేయవలసి వస్తుంటే, పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే చాలు… వేలాదిగా అభిమానులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో తాండూర్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా ఎన్. శంకర్ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఆయన తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా వేలాదిగా అభిమానులు వచ్చారు. వారితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
అయితే ఎప్పటిలాగే సభకు వచ్చిన వారిలో ఎంతమంది జనసేన అభ్యర్ధికి ఓట్లు వేస్తారు? అంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేరు.
తాండూరు నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పైలట్ రోహిత్ రెడ్డికి ఆ నియోజకవర్గంపై పూర్తి పట్టుంది. నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రతినిధులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినప్పుడు, ఆయనే వారిని పోలీసులకు పట్టించారు. ఆ తర్వాత ఆయనను కేసీఆర్ సుమారు రెండు నెలలు ప్రగతి భవన్లో తనతోనే ఉంచుకొన్నారు. కనుక ఆయన కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు. ఆయనకు కేసీఆర్ పూర్తి సహాయసహకారాలు ఉన్నాయి.
ఇక తాండూరు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బి. మనోహర్ రెడ్డికి కూడా నియోజకవర్గంపై మంచి పట్టుంది. కనుక పైలట్ రోహిత్ రెడ్డిని, మనోహర్ రెడ్డిని ఓడించడం జనసేనకు చాలా కష్టమే. పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన అభిమానులలో ఎంత మంది జనసేన అభ్యర్ధి శంకర్ గౌడ్కు ఓట్లేస్తారో తెలియాలంటే డిసెంబర్ 3న ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.




