వైసీపీ చివరి కోరిక… చంద్రబాబు, పవన్ తీర్చేయబోతున్నారా?

Pawan-Kalyan-Chandrababu-Naidu-TDP-JanaSena-Allianceఒక్క ఛాన్స్ అంటూ ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతలు, మరో 25-30 ఏళ్ళు మేమే రాష్ట్రాన్ని పాలిస్తామని చెపుతున్నారిప్పుడు. మేమే 175 సీట్లు గెలుచుకొంటామని గొప్పలు చెప్పుకొంటున్న జగనన్న, బటన్ నొక్కుడు సభలలో నేను ఆ దేవుడిని, ప్రజలని (లబ్ధిదారులను మాత్రమే) నమ్ముకొని ఒంటరి పోరాటం చేయబోతున్నానని నాపై తోడేళ్ళ గుంపు దాడి చేయబోతోంది కనుక నన్ను మీరే ఆదుకోవాలని ధైన్యంగా మాట్లాడుతుంటారు. మళ్ళీ వెంటనే “టిడిపి, జనసేనలకి ఒంటరిగా పోటీ చేయగల దమ్ముందా?175 సీట్లకు పోటీ చేస్తామని చెప్పగలరా?” అంటూ సవాళ్ళు విసురుతుంటారు.

ఈవిదంగా అహంభావం, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీ నేతలకు టిడిపి, జనసేన, బిజెపిలు ఊహించని విదంగా షాక్ ఇవ్వబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి.

ADVERTISEMENT

నిన్న మొన్నటి వరకు టిడిపి, బిజెపిల మద్య ఊగిసలాడిన పవన్‌ కళ్యాణ్‌, “ఇప్పుడు మేమే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. నేనే ముఖ్యమంత్రినవుతానని” కుండబద్దలు కొట్టిన్నట్లు చెపుతుండటం అందరూ వింటూనే ఉన్నారు.

ఈరోజు మంగళగిరిలో టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఉద్దేశ్యించి, “175 సీట్లలో పోటీకి సిద్దంగా ఉండండి. మొత్తం 175 నియోజకవర్గాలలో టిడిపి విజయం సాధించాలి. అందుకు తగ్గట్లుగా ఇప్పటి నుంచే అందరం కలిసికట్టుగా పనిచేద్దాము,” అని అన్నారు. అంటే జనసేనతో పొత్తులు లేవని స్పష్టంగా చెప్పేశారని భావించవచ్చు.

“నాకు ఒక్క అవకాశం ఇవ్వండి… నేను ముఖ్యమంత్రినవుతానంటూ” పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు చేస్తున్న అభ్యర్ధనలను వైసీపీ నేతలు కూడా డీకోడ్ చేసి టిడిపితో సీట్ల పంపకాల బేరం కుదరకపోవడం వలననే ఒంటరి పోరాటానికి సిద్దమవుతున్నారని చెపుతున్నారు. కనుక వారికీ అర్దమైన్నట్లే ఉంది. బిజెపి కూడా జగన్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించేసి కత్తులు సిద్దం చేసుకొంటోంది.

కనుక సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు కోరుకొంటున్నట్లే టిడిపి, జనసేనలు వేర్వేరుగానే పోటీ చేయబోతున్నాయి. అవి వేర్వేరుగా వస్తే వాటిని అవలీలగా చిత్తుచిత్తు చేసేయగలమని జగన్‌ భావిస్తున్నారు. అయితే తమ ప్రభుత్వం, పాలన గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేసేబదులు, ‘ఎఫ్-2’ సినిమాలో ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అని చిటికెలు వేసుకొంటూ, ఇంటింటికీ స్టికర్స్ అంటించుకొని భ్రమలలో గడిపేస్తున్నారు. కనుక తమను ఒంటరిగా ఎదుర్కోవాలనే వైసీపీ అధినేత చివరి కోరికను చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, బిజెపి నేతలు తీర్చేయబోతున్నారని అర్దమవుతోంది. మరిప్పుడు జగనన్న సేనలకు ఇది ఆమోదమేనా?యుద్ధానికి సిద్దమేనా?

ADVERTISEMENT
Latest Stories