గత రెండు రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న భీకర రాజకీయ యుద్ధాలు చూస్తున్నప్పుడు, బిజేపికి అనుకూల వాతావరణం ఏర్పడుతోందనిపిస్తుంది.
కేసీఆర్ శాసనసభకు రాకుండా ఫామ్హౌసులో కూర్చొని రాజకీయ కుట్రలు చేస్తున్నారని, శాసనసభ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు చేసిన అరాచకమే ఇందుకు నిదర్శనమని, డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నిన్న శాసనసభలో అన్నారు.
మరోపక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ చనిపోవాలని సిఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. ఆ పార్టీ గూండాలు చావు డప్పు కొడుతూ నిన్న ఫామ్హౌసు వరకు చేరుకోవడం కూడా అదే సూచిస్తోంది. కేసీఆర్ని అడ్డుతొలగించుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, పోలీసులు వారిని అడ్డుకోకుండా తోడుగా వెళ్ళారు.
ఈ పరిణామాలు గమనిస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని స్పష్టమవుతోంది. నేడు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిసి తాజా పరిణామాలు వివరించి, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తాము,” అని అన్నారు.
ఇప్పుడు శాసనసభలో భట్టి విక్రమార్క, కేటీఆర్ చెప్పిన ఈ రెండింటిని కలిపి చూసినట్లయితే, రాష్ట్రంలో బిజేపికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి అధికారంలోకి వవస్తుందని కేసీఆర్, కేటీఆర్ చెప్పుకుంటున్నప్పటికీ, వారికి బిజేపిలో విలీనం లేదా పొత్తులు పెట్టుకునే ఆలోచన ఉందని కల్వకుంట్ల కవిత ఇదివరకే బయటపెట్టారు.
కనుక భట్టి విక్రమార్క చెప్పినట్లు కేసీఆర్ ఫామ్హౌసులో కూర్చొని ఈవిధంగా రాజకీయాలు చేస్తూ, తెలంగాణలో బిజేపికి లైన్ క్లియర్ చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే కేసీఆర్ తమ ప్రభుత్వానికి ఎసరు పెడుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి గ్రహించినప్పుడు, మజ్లీస్ అధినేత ఓవైసీ కోరినట్లు మునుపటి ఫైర్ చూపేందుకు, ఫామ్హౌసు ముట్టడి వంటి ఆలోచనలు చేస్తే, బీఆర్ఎస్ పార్టీకే మైలేజ్ లభిస్తుంది.
స్పీకర్పై తమ ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలతో ఇరుకునపడి, ఏవిధంగా బయటపడాలని బీఆర్ఎస్ పార్టీ తల పట్టుకున్నప్పుడు, కాంగ్రెస్ శ్రేణుల ఫామ్హౌసు ముట్టడితో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది.
బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలోనే కేసీఆర్ ‘నా చావును కోరుకునేవాడితో నేను సమావేశాలకు హాజరవ్వాలా?” అని ప్రశ్నించారు. అది శాసనసభకు హాజరవుకుండా తప్పించుకునే కుంటి సాకు అని మొదట అందరూ భావించారు. కానీ ఫామ్హౌసు ముట్టడితో ఆయన చెప్పింది నిజమే అని ప్రజలు నమ్మేలా చేశాయి కాంగ్రెస్ శ్రేణులు.
కేటీఆర్తో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ ముట్టడిని ‘కేసీఆర్ని హత్య చేసేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రగా’ అభివర్ణిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిపించడం, నేడు గవర్నర్ని కలిసి రాష్ట్రపతి పాలనకు అభ్యర్ధించడం వంటివి గమనిస్తే, తెలంగాణ రాజకీయాలలో ఏదో జరుగబోతోందనిపిస్తుంది.
ఇప్పటికిప్పుడు పెద్ద మార్పులు జరుగకపోవచ్చు కానీ ఇలాంటి పరిణామాలు వరుసగా జరుగుతుంటే, తెలంగాణ రాజకీయాలలో మార్పు తప్పదు.
కాంగ్రెస్ పార్టీలో సిఎం రేవంత్ రెడ్డికి అంతర్గత శత్రువులు కూడా ఉన్నారు. కనుక మరింత అప్రమత్తంగా, మరింత తెలివిగా ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరమనిపిస్తుంది.





