ఏపీలో టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకొని వరుసపెట్టి సమన్వయ సమావేశాలు జరుపుకొంటున్నాయి. వాటి పొత్తులను వైసీపియే కాక సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ పోరాడుకొంటున్నాయి. ఇదే సమయంలో జనసేన పార్టీ తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎవరి కోణంలో వారు విశ్లేషించి అభిప్రాయాలు, ఏపీలో పొత్తులపై ప్రభావం, పర్యవసానాల గురించి చెపుతూనే ఉన్నారు.
నిజానికి ఏపీలో బీజేపీతో జనసేన సాంకేతికంగా పొత్తులోనే ఉంది కనుక తెలంగాణలో పొత్తులు పెట్టుకోవడం పెద్ద విచిత్రం కాదనుకోవాలి. అయితే తెలంగాణలో జనసేనకు పెద్దగా బలం లేనప్పటికీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అభిమానులున్నారు. కానీ అంతకు మించి ఆంధ్రా ఓటర్లున్నారు. కనుక వారి ఓట్ల కోసమే బీజేపీ పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకొంటోందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. తద్వారా ఆంధ్రా ఓటర్లను చీల్చి పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ముందు నష్టపోయేది జనసేన పార్టీయే తప్ప బీజేపీ కాదు.
పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఆంధ్రా ఓటర్లను చీల్చగలరో లేదో మరికొద్ది రోజులలో ఎలాగూ తేలిపోతుంది. అయితే ఆయన ఓట్లు చీల్చబోతుంటే, ఓట్లు చీలకూడదనే టిడిపి ఎన్నికల బరిలో నుంచి తప్పుకొందని అది ఎందుకో అందరికీ తెలిసిందే. కనుక ఈవిషయంలో టిడిపి, జనసేనలు పూర్తిభిన్నంగా వ్యవహరిస్తూ, ఏపీలో మాత్రం ఆప్యాయంగా చేతులు కలుపుకొని పనిచేసుకొంటుండటం కాస్త విడ్డూరంగానే ఉంది.
ఏపీలో టిడిపితో, తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్కు బలమైన కారణాలే ఉండవచ్చు. కానీ ఏపీలో టిడిపితో పొత్తులు పెట్టుకొనేందుకు బీజేపీ అయిష్టత వ్యక్తం చేస్తున్నప్పుడు, తెలంగాణలో దాంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాజకీయ అయోమయం సృష్టించారని చెప్పక తప్పదు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చి ఉండి ఉంటే బాగుండేది.




