ఉన్నది ఉన్నట్లు మొహం మీదే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై స్పందించారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో వ్యక్తిగత కార్యం మీద విచ్చేసిన జేసీ, “రాజకీయాలకు పవన్ టెంపర్ మెంట్, ఆయనకు ఉన్నశక్తి చాలదని, తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం మంచిది కాదని, సినిమా హీరోలకు ఓట్లేసే పరిస్థితి తగ్గిపోయిందని, ఎంతో గ్లామర్ ఉన్న ఎన్టీ రామారావు, జయలలితకు మాత్రమే ప్రజలు ఓట్లు వేశారని, ఓట్లు వేయించుకునే అంతటి గ్లామర్ ఇప్పుడు ఉన్న నటులకు లేదని” అన్నారు.
2019లో జనసేన పార్టీకి ఆశాజనకంగా ఉండదని, కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లెవరైనా సరే ఫ్టస్ టైమే అధికారంలోకి రావాలని, అలా కాకుండా రెండో సారో, మూడో సారో అధికారంలోకి వచ్చిన వాళ్లను తాను ఇంతవరకూ చూడలేదని జేసీ అభిప్రాయపడ్డారు. మొన్నొచ్చిన కేజ్రీవాల్ వెంటనే అధికారంలోకి వచ్చారు. బీఎస్పీ నేత మాయావతి కూడా అంతే. యూపీలో అఖిలేశ్ యాదవ్ కూడా పార్టీ పెట్టగానే అధికారంలోకి వచ్చారు. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అంటారు కదా… ప్రజలను ఆకర్షించుకుని ఏకాఎకీన అధికారంలోకి వచ్చినవాళ్లే!’ అని జేసీ అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ ను కూడా తాకాయి.



