సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎల్లుండి తన కొత్త రాజకీయ పార్టీ జెండా అజెండా ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ రాజకీయ పార్టీ వల్ల ఎవరికీ నష్టం ఎవరికీ లాభం అనేదాని పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ‘జేడీ’గా సుప్రసిద్ధుడైన ఆయన తన పార్టీ పేరు కూడా… అలాగే స్ఫురించేలా ‘జన ధ్వని’ (జేడీ) అని పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. వందేమాతరం అనే పేరు సైతం ప్రచారంలో ఉందని కొందరు అంటున్నారు.
[m9ad]
అయితే లక్ష్మీనారాయణ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ పుకార్ల పై స్పందించడం లేదు. జేడీ పేరు పైనే లక్ష్మీనారాయణ ఆసక్తి చూపుతున్నట్లు భావిస్తున్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ వేదికగా ఎల్లుండి జేడీ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశానికి ఇప్పటికే కొంతమందికి ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. అయితే ఆ రోజు పార్టీ పేరు ప్రకటించకుండా పార్టీ పేరు ఏముంటే బాగుంటుందో చెప్పాలంటూ ఆ భేటీకి హాజరయ్యే వారి నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేసే అవకాశముందని కొందరు అంటున్నారు.
అయితే చివరి నిముషంలో పెట్టే ఈ పార్టీ వల్ల లక్ష్మీనారాయణకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఎపిలో సంచలనం సృష్టించిన వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్రెడ్డి మైనింగ్ కేసుల వ్యవహారంతో పాటు సత్యం కంప్యూటర్స్ కేసు అప్పటి సీబీఐ జెడి లక్ష్మీనారాయణ అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ 2006 లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ సిబిఐ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఆ తరువాత తను సొంత క్యాడర్ మహారాష్ట్రకు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన ఆ రాష్ట్రానికి అడిషనల్ డీజీగా ఉండగా స్వచ్చంద పదవీ విరమణ చేసి రాజకీయాలలోకి వస్తున్నారు.



