అయితే జేడీ వైసీపిలో చేరిపోవడం ఖాయమేనా?

JD Lakshminarayana

సుమారు పదేళ్ళ క్రితం సీబీఐ అడిషనల్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన వివి లక్ష్మినారాయణ జగన్‌ అక్రమస్తుల కేసులపై లోతుగా దర్యాప్తు జరిపి, సీబీఐ కోర్టులో ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేశారు. అప్పటి నుంచే ఆయన ఇంటిపేరు వివికి బదులు జేడీ లక్ష్మినారాయణగా ఫేమస్ అయ్యారు. నీతి నిజాయితీకి కట్టుబడి ఉండే అత్యంత ధైర్యవంతుడైన అధికారిగా ఆయన మంచి గుర్తింపు పొందారు.

ADVERTISEMENT

ఆ తర్వాత ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి జనసేనలో చేరి విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనను వీడి మళ్ళీ యువతలో స్పూర్తినింపే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

మరోవైపు ఆనాడు ఆయన పెట్టిన కేసులలో చిక్కుకొన్న జగన్మోహన్‌ రెడ్డి, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి పలువురు ప్రముఖులు జైలులో 16 నెలలు గడపడం, ఆ కేసుల నుంచి బయటపడేందుకు వారందరూ నేటికీ న్యాయపోరాటాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

అప్పుడు జగన్మోహన్‌ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ జైలుకి పంపించిన లక్ష్మినారాయణే ఇప్పుడు అదే జగన్మోహన్‌ రెడ్డిని, ఆయన పాలనను పొగిడితే ఎలా ఉంటుంది?అదే జరిగింది. ఆయన వైసీపిలో చేరబోతున్నారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీశైలంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన జగన్మోహన్‌ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం చూస్తే ఆ ఊహాగానాలు నిజమే అని అర్దమవుతుంది.

శ్రీశైలంలో తాను చదువుకొన్న పాఠశాలలో పూర్వ విద్యార్దుల సమావేశానికి ఆయన వెళ్ళినప్పుడు, ఆయన మాట్లాడుతూ, “విద్యా వైద్య రంగాలకు ఏ ప్రభుత్వామైతే ప్రాధాన్యత ఇస్తుందో ఆ రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తాయి. నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి చక్కటి కార్యక్రమాలను వైసీపి ప్రభుత్వం అమలుచేస్తోంది,” అంటూ ప్రశంసించారు.

మంచి ఎవరు చేసినా మెచ్చుకోవలసిందే. కనుక వైసీపి ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి మంచి పనులను లక్ష్మినారాయణ మెచ్చుకొన్నారని భావించవచ్చు. అయితే వైసీపి ప్రభుత్వం చేస్తున్న మంచికంటే రాష్ట్రానికి జరుగుతున్న కీడే ఎక్కువగా ఉందని, ముఖ్యంగా విద్యారంగంపై చేస్తున్న ప్రయోగాలతో ప్రాధమిక, సెకండరీ విద్యావ్యవస్థ కుప్పకూలిపోయే స్థితికి చేరుకొంటోందని ఐపిఎస్ అధికారిగా చేసిన లక్ష్మినారాయణకు తెలియదనుకోలేము.

కానీ జగన్‌ పాలన అద్భుతంగా ఉందని మెచ్చుకోవడం చూస్తే ఆయన కూడా కళ్ళకు గంతలు కట్టేసుకొని లేదా వైసీపి కళ్ళద్దాలతో ఆంద్రాను చూడటం మొదలుపెట్టిన్నట్లున్నారనిపిస్తుంది. ఒకవేళ ఆయన వైసీపిలో చేరకపోయినా, వేరే వేదికలపై ఆంద్రాలో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి మాట్లాడి ఉంటే నేడు ఎవరూ ఆయనను ఇలా వేలెత్తి చూపగలిగేవారు కాదు కదా?

ADVERTISEMENT
Latest Stories