వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి 175 సీట్లు లక్ష్యంగా ఒక్కో జాబితా విడుదల చేస్తుంటే, వైసీపి పతనానికి ఒక్కో మెట్టు దిగుతున్నట్లుంది. మూడో జాబితాతో మళ్ళీ పార్టీలో అసమ్మతి సెగలు మొదలయ్యాయి. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధిని కాదని మంత్రి జోగు రమేశ్కు ఖరారు చేయడంతో ఆయన భగ్గుమంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా పెనమలూరులో సీనియర్ వైసీపి నాయకుడు పడమటి సురేష్ బాబు, ఆయన కుమార్తె స్నిగ్ధ మండిపడుతున్నారు. మూడో జాబితా వెలువడగానే ఆమె డిసిఎంఎస్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిరువురూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ముందుగా స్నిగ్ధ మీడియాతో మాట్లాడుతూ, “మా నాన్నగారు 2010 నుంచి పెనమలూరులో వైసీపిని బలోపేతం చేసేందుకు ఎంతగానో కృషి చేశారు. కృష్ణా జిల్లాలో మొట్ట మొదటగా పార్టీ జెండా పట్టుకున్నది మా నాన్నగారే. ఆయన ప్రోత్సాహంతోనే పలువురు వైసీపిలో చేరారు. కనుక గత ఏడాది ఫిబ్రవరిలో మా నాన్నగారికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు. అయినప్పటికీ మా నాన్నగారు పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు.
ఈసారి తప్పకుండా మా నాన్నగారికి లేదా నాకు పెనమలూరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. మొన్న మూడో జాబితా వెలువడే చివరి నిమిషం వరకు కూడా మాకే టికెట్ అని చెపుతూ వచ్చారు. కానీ మమ్మల్ని కాదని వేరేవారికి ఖరారు చేశారు.
వేరే నియోజకవర్గంలో పనికిరాని ఎమ్మెల్యే, మా నియోజకవర్గానికి ఎలా పనికివస్తారు?తన నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయిన ఆయన పెనమలూరుకి ఏమి చేయగలరు?కనుక మాకు, పెనమలూరు ప్రజలకు అన్యాయం చేయవద్దని వేడుకునేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు మేము ఓ 50 సార్లు ప్రయత్నించాము. కానీ ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన చుట్టూ ఉన్నవారే మమ్మల్ని కలవనీయకుండా అడ్డుకున్నారు. మాకు చాలా అన్యాయం జరిగిందని భావిస్తున్నాము. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇంకా పార్టీలో ఉండాల్సిన అవసరం మాకేమిటి?” అని పడమటి స్నిగ్ధ అన్నారు.
పడమటి సురేష్ బాబు మాట్లాడుతూ, “పదమూడేళ్ళు పార్టీ కోసం కష్టపడితే చివరికి పనికిరానివాడినని ఇలా పక్కన పెట్టేయడం చాలా అవమానంగా భావిస్తున్నాను. కృష్ణాజిల్లాలో వైసీపి ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా “అక్కడ మన పడమటి సురేష్ బాబు ఉన్నారు కదా?” అనేవారు.
గత ఎన్నికలలో పార్ధసారధికి టికెట్ ఇచ్చినప్పుడు నేను అడ్డు చెప్పలేదు. నాకే ఇవ్వాలని పట్టుబట్టలేదు. ఆ తర్వాత కూడా మా నియోజకవర్గంలో గ్రూపులు ఉండకూడదని నేను దూరంగా ఉంటూ ఆయనకు సహకరించాను. ఇప్పుడు పార్ధసారధిని కూడా జగన్ పక్కన పెట్టారు కదా?మరి నాకు టికెట్ ఇవ్వడానికి అభ్యంతరం దేనికి?
ఇన్నేళ్ళు జిల్లాలలో వైసీపికి పనికివచ్చిన వాడిని టికెట్ ఇవ్వడానికి పనికిరాకుండా పోయానా?ఇది మమ్మల్ని అవమానించడంగానే భావిస్తున్నాము. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని పడమటి సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేశ్ పోటీ చేయిస్తే తప్పకుండా ఆ సీటు గెలుచుకుంటారని జగన్ లెక్కలు వేసుకున్నారు. కానీ ఆయనను టిడిపి, జనసేనలు ఓడించనవసరం లేదు. కొలుసు పార్ధసారధి, పడమటి సురేష్ బాబు ఇద్దరే చాలుగా!




