సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి, బాలయ్యల ‘ఖైదీ నంబర్ 150,’ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అందరూ తమ తమ అనుభూతులను పంచుకుంటున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా చిరంజీవి, బాలయ్యలపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
చిరంజీవి సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది అనేది కేవలం మాట వరసకే అని, చిరంజీవిలోని జోరు, ఊపు, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని, ‘జై చిరంజీవా… జగదేకవీరా’ అంటూ ట్వీట్ చేశారు. ఇక, తెలుగువాడు “గౌతమీపుత్ర శాతకర్ణి” పాత్రలో అద్భుతమైన నటనతో బాలయ్య జీవించారని, తెలుగు వాడి చరిత్రని దశదిశల చాటి చెబుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీమ్ కు అభినందనలు తెలిపారు.
ఈ సినిమా గురించి సాటి తెలుగువాడిగా తాను కూడా గర్వపడుతున్నానని, ‘సాహో శాతకర్ణి… జయహో శాతకర్ణి’ అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి, బాలయ్యలను చూసి గర్విస్తున్నానని ఈ దర్శకేంద్రుడు. ఒకప్పుడు పెదవి విప్పకుండా మౌనం వహించే ఈ మౌనముని, ఇటీవల మాత్రం ముత్యాల్లాంటి అక్షరాలతో తన భావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.



