సీరియస్ సినిమాలలో కామెడీ ఒకలా ఉంటుంది. కామెడీ సినిమాలలో కామెడీ మరోలా ఉంటుంది. ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ మొదటి రకానికి చెందినవారు.
అత్యంత సీరియస్గా రాజకీయాలు జరుగుతున్నప్పుడు కేఏ పాల్ ఎంట్రీ ఇస్తే అందరూ ఒక్కసారి రిలాక్స్ అయిపోవచ్చు.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ- కల్వకుంట్ల కవిత మద్య చాలా సీరియస్గా రాజకీయాలు జరుగుతుంటే, కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు!
ఆయన కవితని తన ప్రజాశాంతి పార్టీలో చేరవలసిందిగ ఆహ్వానించారు. అందుకు బలమైన కారణం కూడా ఆయనే చెప్పారు.
ఆమె ఎలాగూ బీసీల కోసం పోరాడాలనుకుంటున్నారు. బీజేపి బ్రాహ్మణుల పార్టీ, కాంగ్రెస్ రెడ్ల పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీలుగా ముద్ర పడ్డాయని కనుక కనుక బీసీలకు చెందిన ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీలో చేరి తన లక్ష్యం నెరవేర్చుకోవచ్చని కేఏ పాల్ సూచించారు. తద్వారా బీసీల పట్ల నీ చిత్తశుద్ధి, నిజాయితీ నిరూపించుకోవాలని కేఏ పాల్ కవితకు హితవు పలికారు.
కేఏ పాల్ చాలా కాలంగానే రాజకీయాలలో ఉన్నారు. కానీ అయనకు అవి ఇంకా ఒంటపట్టినట్లు లేదు. అందుకే ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే గొప్ప రాజకీయ లక్ష్యాలు నిర్దేశించుకున్న కల్వకుంట్ల కవితని వచ్చి తన పార్టీలో చేరమని అమాయకంగా అడుగుతున్నారనుకోవచ్చు. ఆమె తన పార్టీలో చేరి తన ముందు చేతులు కట్టుకొని నిలబడతారని కేఏ పాల్ ఎలా అనుకున్నారో? కానీ ఆయనకు అభ్యంతరం లేకపోతే రేపు ఆమెతో కలిసి నడిచే పార్టీలలో ప్రజాశాంతి కూడా ఒకటి కావచ్చు.





