‘వీవీడీ’ కొబ్బరినూనె సంస్థ తనతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను తనకు 2.50 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ మద్రాస్ హైకోర్టులో వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. సదరు సంస్థ ప్రకటనల్లో నటించేందుకు గానూ 2008లో కాజల్ ఒప్పందం కుదుర్చుకోగా, తాను నటించిన ప్రకటనను ఒక ఏడాది పాటే ప్రసారం చేయాలని కాజల్ నిబంధన విధించింది. అయితే ఆ తర్వాత కూడా సదరు ప్రకటన కొనసాగడంతో 2011లో మద్రాస్ హైకోర్టులో కాజల్ కేసు వేసింది.
తాను నటించిన ప్రకటనను తక్షణం నిలిపి వేయించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను తనకు 2.50 కోట్లు చెల్లించాలని సదరు సంస్థను ఆదేశించాలని కోరింది. కాజల్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఆమె అభ్యంతరాలను కొట్టివేసింది. చట్టప్రకారం ఆ ప్రకటన కాపీ రైట్స్ దానిని రూపొందించిన సంస్థకే చెందుతాయని పేర్కొంది. ఆ ప్రకటనను ఒక్క ఏడాదే ప్రసారం చేయాలనే హక్కు కాజల్ కు ఉండబోదని, వాణిజ్య ప్రకటన ప్రమోషన్ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకు ఉంటాయని న్యాయమూర్తి జస్టిస్ టి.రవీంద్రన్ పేర్కొన్నారు.


