తుని ఘనటలో అరెస్టులకు నిరసనగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తోన్న ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించకుండా ఉండేందుకు ఆయనకు తక్షణం వైద్యం అందించాల్సిన అవసరం ఉందని, కానీ వైద్య పరీక్షలకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదని తొలుత వైద్యులు హెల్త్ బులిటన్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మరో దఫా చర్చలకు ప్రభుత్వ బృందాన్ని పంపిస్తామని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. అలాగే వైద్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ప్రసంగిస్తూ… కాకినాడ నుండి అదనపు వైద్యులను కూడా రప్పించామని, అయినా ముద్రగడ సహకరించడం లేదని తెలిపారు.
తాజాగా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చేసిన ప్రకటనలో… ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించారని తెలిపారు. రాజమహేంద్రవరంలో ప్రసగించిన ఆకుల.., ముద్రగడతో తాము, కాపు జేఏసీ నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపామని అన్నారు. అరెస్టైన 17 మందికి బెయిల్, సీబీసీఐడీ విచారణ నిలిపివేతపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గత వారం రోజుల ముద్రగడ మరియు వారి కుటుంబ సభ్యుల ఆమరణ దీక్షకు తెరపడినట్లయ్యింది.



