కర్ణాటక రాజధాని బెంగళూరు నూతన సంవత్సర వేడుకులకు శరవేగంగా ముస్తాబవుతోంది. ఈనెల 31న బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్తో ఆటాపాట నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు ‘సన్నీ నైట్స్’కు అనుమతులు లేవని హోంశాఖా మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.
అయితే వీటిని బేఖాతరు చేస్తూ టైమ్స్ క్రియేషన్స్తో పాటు మరికొన్ని సంస్థలు గంటకు 50 లక్షల చొప్పున చెల్లిస్తూ ‘సన్నీ నైట్స్’ నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. సన్నీలియోన్ భద్రత కోసం మరో 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు సన్నీ లియోన్ షోలో పాల్గొనేందుకు దక్షిణాది, ఉత్తరాది అని తేడా లేకుండా టికెట్ల కోసం ఎగబడతున్నారు. రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు గంట పాటు జరిగే సన్నీ షోలో అభ్యంతరకర అంశాలు ఉండవని, కేవలం సినిమా పాటలకు మాత్రమే ఆమె నృత్యం చేస్తారని టైమ్స్ క్రియేషన్స్ ఎండీ హరీశ్ తెలిపారు.
కాగా, బెంగళూరులో ఆమె అడుగుపెడితే సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామంటూ కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఇటీవల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆమె కనుక బెంగళూరు వస్తే తామంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. దీంతో పోలీసులు కూడా సన్నీ షోకు అనుమతి నిరాకరించగా, మరోవైపు నిర్వాహకులు మాత్రం షో టికెట్లను విక్రయిస్తున్నారు.



