మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకే నే ఏడుస్తున్నా అందట వెనకటికి ఓ ఇల్లాలు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు, ఆమె కూడా అలాగే బాధ పడుతున్నట్లు అనిపిస్తుంది.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లాభనష్టాల లెక్కలు వేసుకున్నాక, కేటీఆర్ విద్యార్ధులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆ మాత్రం కూడా ధైర్యం చేయలేకపోయారు.
దాదాపు నెలరోజులుగా ఢిల్లీలో విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నా, అవి ఉద్రిక్తంగా మారినా ఆమె మొక్కుబడిగా స్పందించారు తప్పితే విద్యార్ధులకు అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు.
కానీ వారి ఆందోళనలు ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి తాపీగా చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేశారు. అంతటితో ముగిస్తే బాగుండేది.
కానీ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు విద్యార్ధులతో కలిసి శనివారం సాయంత్రం ర్యాలీలో పాల్గొనడాన్ని ఆమె తప్పు పట్టారు. సిఎం రేవంత్ రెడ్డి విద్యార్ధుల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వాన్ని కూడా విద్యార్ధులు ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయంతోనే రేవంత్ రెడ్డి ఈ కొత్త డ్రామా ఆడుతున్నారని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఉద్దేశ్యాలున్నప్పటికీ అది సీజేపీ ఆందోళనలకు బహిరంగంగానే సంఘీభావం తెలిపింది. పార్లమెంట్ లోపల, బయట వారి తరపున పోరాడింది.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆ పార్టీ నేతలు మద్దతుగా ఆందోళనలు చేశారు. అలాగే సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా చేశారు. కనుక విద్యార్ధుల ఆందోళనలలో వారూ భాగస్వాములే అని చెప్పవచ్చు.
ఈ ఆందోళనలకు దూరంగా ఉండిపోయిన కల్వకుంట్ల కవిత, విద్యార్ధులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీని, సిఎం రేవంత్ రెడ్డిని ఆక్షేపించడం చూస్తే, ఈ క్రెడిట్ తనకు దక్కలేదు.. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి దక్కిందనే బాధతోనే ఈవిధంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది.
విద్యార్థుల విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు. యువతకు ఇచ్చిన హామీలపై ఎక్కడ నిలదీస్తారోనని మీరే ఊరేగింపులు చేస్తారా?
తెలంగాణ యువతకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిన చరిత్ర మీది. ఇకనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే తెలంగాణ యువత మిమ్మల్ని గద్దె దించటం… pic.twitter.com/TOstVZfxO2
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 26, 2026




