ఊహించినట్లే బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ మేరకు ప్రకటన చేసి మీడియాకు లేఖ విడుదల చేశారు.
దానిలో ఆమె ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు, పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నందున పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశం మేరకు కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కనుక గత నాలుగు నెలలుగా సాగుతున్న ఈ డ్రామాలకు నేటితో ముగింపు పలికినట్లయింది. కనుక ఇప్పుడు బంతి ఆమె కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు.
మళ్ళీ తండ్రి నుంచి తప్పక పిలుపు వస్తుందని బుజ్జగించి పార్టీలోకి తీసుకుంటారనే ఆశతో ఇంతకాలం ఆమె తెలంగాణ జాగృతి కండువా వేసుకొని రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు అదే కండువాతో ముందుకు సాగాలసి ఉంటుంది. లేదా సొంత పార్టీ పెట్టుకొని లేదా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలలో కొనసాగవలసి ఉంటుంది.
అంత కంటే ముందు దీనిపై ఆమె ఏమంటారనేది చాలా ఆసక్తికరం. ఆ తర్వాత ఏ కుంపటి అనేది ఆలోచించు కోవచ్చు.
తన తండ్రి కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయని ఇది వరకు చెప్పిన ఆమె నిన్న ఆ దెయ్యాల పేర్లు హరీష్ రావు, సంతోష్ రావు అని చెప్పేశారు.
ఆ దెయ్యాలే తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని ఇదివరకు చెప్పారు. ఇప్పుడు ఆ దెయ్యాలే తనను పార్టీ నుంచి బయటకు గెంటేశాయని చెప్పడం ఖాయమే.
కానీ మా డాడీ దేవుడు… ఆయనపై ఈగ వాలనీయను అని కల్వకుంట్ల కవిత చెపితే అందుకు ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే విచిత్రం కదా?
కాళేశ్వరం కేసుని సీబీఐకి అప్పగించాలనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం, ఇప్పుడు కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తెలంగాణ రాజకీయాలలో ఒకేసారి రెండు కొత్త అధ్యాయాలు ప్రారంభం కాబోతున్నాయి. రెండూ చాలా ఉత్కంతఠ కలిగించేవే!






