శాసనసభ ఎన్నికల వరకు తెలంగాణలో కేసీఆర్ మాటకు, బిఆర్ఎస్ పార్టీకి ఎదురే ఉండేది కాదు. ఇక కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్లో అయితే ఆయనపై పోటీ చేసి గెలవగల మగాడు పుట్టనేలేదనుకోవచ్చు.
కనుక కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ప్రగల్భాలు పలికినా ఎన్నికల్లో గెలిచేది మనమే, మళ్ళీ నేనే ముఖ్యమంత్రినవుతా అని కేసీఆర్ చాలా ధీమాగా చెప్పుకున్నారు. కానీ ఎన్నికల గంట మ్రోగేసరికి ఆయనకు కూడా భయం మొదలైంది. దాంతో తొలిసారిగా గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు.
తెలంగాణ రాజకీయాలను కంటి చూపుతో శాసిస్తూ ప్రధాని నరేంద్రమోడీ అంతటివాడిని కూడా ధిక్కరించే స్థాయికి ఎదిగిన కేసీఆర్ ఓటమి భయంతో రెండు చోట్ల పోటీ చేశారు. కానీ తెలంగాణలో రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులున్న ఆంధ్రాలో, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం ఒక్కచోట నుంచే మళ్ళీ పోటీ చేస్తుండటం గమనార్హం.
ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చొక్కా మడతపెట్టి యుద్ధం చేయమని వైసీపి శ్రేణులను, వాలంటీర్లను ప్రోత్సహిస్తున్నారు. మరోపక్క కుప్పంలో చంద్రబాబు నాయుడుని ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి అనేక ఏర్పాట్లు చేసి సిద్దంగా ఉంచారు.
ఆ భయంతో చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేయకుండా భార్యని బరిలో దింపుతున్నారంటూ దుష్ప్రచారం కూడా చేశారు. కానీ ఇటువంటి అననుకూల పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ కుప్పం ఒక్క చోట నుంచే ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అది ఆయన ఆత్మవిశ్వాసానికి, కుప్పం ప్రజలపై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా భావించవచ్చు.
మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఒక్క చోట నుంచే చేస్తారా లేదా మళ్ళీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా?అనేది చాలా ఆసక్తికరంగా మారింది. రెండు చోట్ల చేస్తే అది ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుంది. కనుక ఆయన కూడా జనసేనకు చాలా బలం ఉందని భావిస్తున్న ఒకే ఒక్క చోట నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెడితే చాలా హుందాగా, అభిమానులకు చాలా సంతోషంగా ఉంటుంది.




