తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈరోజు దుబాయ్, యూఏఈ దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. 14 వరకు ఆయన అక్కడ ఉండేలా ప్రణాళిక రూపొందించారు. దుబాయ్లో ఆదివారం నుంచి 13వతేదీన జరిగే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సుకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే శాసన సభ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ, ఇతరత్రా కార్యక్రమాల దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ నెల 17న తెలంగాణ శాసనసభ మొదటి సమావేశం జరగబోతుంది. ఆ మరుసటి రోజే క్యాబినెట్ విస్తరణ కూడా ఉంటుందని సమాచారం. మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎనిమిది మందికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండో విడత పార్లమెంట్ ఎన్నికల తరువాత ఉండొచ్చు. ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండే అవకాశం కనిపిస్తోంది.
స్పీకర్ పదవి కసరత్తు కూడా తలకుమించిన భారంగా పరిణమించింది కేసీఆర్ కు. స్పీకర్ గా పని చేసిన వారు వచ్చే ఎన్నికలలో ఓడిపోయే సంప్రదాయం ఉండడంతో ఆ పదవి తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు గానీ స్పీకర్ పదవి మాత్రం వద్దని వారు అంటున్నారు. దీనితో దానిపై కూడా సుదీర్ఘ కసరత్తు చెయ్యాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆయన దుబాయ్ పర్యటన రద్దు చేసుకున్నారు. దీనితో పండగ రోజులలో కూడా ముఖ్యమంత్రి బిజీగా గడపనున్నారు.



