అసెంబ్లీ అనేది కొంతమంది రాజకీయ నాయకులకు, కొన్ని రాజకీయ పార్టీలకు ఒక స్టేటస్ సింబల్ మాదిరి మారిపోయింది. అధికారంలో ఉంటే తన బలం నిరూపించుకోవడానికి అసెంబ్లీని వేదిక చేసుకుంటున్న నాయకులు అధికారం చేజారగానే తమ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీ ని దాటవేస్తున్నారు.
ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, బిఆర్ఎస్ లు ఉదాహరణలుగా నిలిస్తే నాటి మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సాక్షులుగా మిగిలారు. నాడు అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు, ఇద్దరు నేతలు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద విమర్శలతో రెచ్చిపోయారు.
ఇక ఇప్పుడు ఈ రెండు పార్టీలు ప్రతిపక్షానికే పరిమితం కావడంతో అసెంబ్లీ వద్దు మీడియానే ముద్దు అన్నట్టుగా అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన ప్రజా సమస్యలను ప్రెస్ క్లబ్ లలో పరిష్కరించుకోవడానికి ఉత్సహం చూపిస్తున్నారు తెలంగాణలోని బిఆర్ఎస్ నాయకులు.
ఇక ఏపీ విషయానికొస్తే నాడు 151 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీ నాటి అసెంబ్లీ ని కౌరవ సభగా మార్చేసి పైశాచిక ఆనందం అనుభవించింది. ఇక ఇప్పుడు 11 సీట్లకు పరిమితమయ్యి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో నాటి వైసీపీ అహం నేటి తమ హక్కు ను వదులుకుంటుంది.
అసెంబ్లీ ని వదిలి వైసీపీ వీధి పోరాటాలు, మీడియా ప్రెస్ మీట్లతో పబ్బం గడుపుతుంది వైసీపీ. అయితే అసెంబ్లీ విషయంలో ఈ రెండు పార్టీల అధినేతల తీరు ఒక్కటే మాదిరి ఉండడం గమనార్హం.
అయితే అసెంబ్లీ అనేది నాటి హోదా కాదు నేటి అవమానం కాకూడదు. అధికారంలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలి, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల పోరాటానికి సిద్ధమవ్వాలి.
చట్ట సభలు అనేది గౌరవమో, హోదానో కాదు భాద్యత, ఎమ్మెల్యే గా గెలిచిన ప్రతి రాజకీయ నాయకుడు చట్ట సభల ద్వారా తమ నియోజకవర్గ ప్రజల గళం వినిపించాల్సి పవిత్ర ప్రదేశం. అటువంటి ప్రదేశాన్ని హోదా గా , అవమానంగా మార్చేస్తున్నారు జగన్, కేసీఆర్.
అధికారంలో ఉంటేనే అసెంబ్లీ లేకుంటే ఫామ్ హౌస్, ప్యాలస్ లలో కాలం గడిపేస్తాం, మీడియాలో దుమ్ము దులిపేస్తాం అంటూ రెచ్చిపోవడం వైస్ జగన్ కి కానీ కేసీఆర్ కి కానీ ముమ్మాటికీ ముఖం చాటెయ్యడమే అవుతుంది, తప్పించుకుని పారిపోవడం కిందకే వస్తుంది.




