అనేక పోరాటాలు, అనేక ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది.
గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే కేసీఆర్ పాలన చాలా బాగుందనే చాలా మంది ప్రజలు అంగీకరిస్తున్నారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం పునాదులు కదిలిపోయే పరిస్థితులు కనిపిస్తుండటం చాలా ఆశ్చర్యకరమే. కేవలం 8 ఏళ్లలోనే తెలంగాణలో రాజకీయ వాతావరణం ఇంతగా మారిపోవడం చాలా ఆశ్చర్యకరం.
‘ఇలా ఎందుకు జరుగుతోంది?’ అని ప్రశ్నించుకొంటే సిఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడమే అని చెప్పక తప్పదు.
తెలంగాణ ఏర్పడేనాటికే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారం కోల్పోయి చాలా బలహీనపడింది. అదే సమయంలో కేసీఆర్ బలమైన నాయకత్వంలో టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అయినప్పటికీ తెలంగాణలో టిఆర్ఎస్కు ఎదురే ఉండకూడదనో లేదా టిఆర్ఎస్ను ఇంకా బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోనో చచ్చిన పాము వంటి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఫిరాయింపులతో చంపే ప్రయత్నం చేశారు.
ఇక తెలంగాణలో టిఆర్ఎస్కు ఎదురే ఉండదని భావించారు. కానీ అపర చాణక్యుడని పేరొందిన కేసీఆర్ కూడా అక్కడే తప్పటడుగు వేశారు. కాంగ్రెస్ను అడ్డుతొలగించుకొంటే దాని స్థానంలోకి బిజెపి వస్తుందని ఊహించలేకపోయారు. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న బిజెపి వెంటనే కాంగ్రెస్ స్థానంలోకి ప్రవేశించి చాలా వేగంగా నిలదొక్కుకొంది.
అదే… కేసీఆర్ కాంగ్రెస్ను బ్రతకనిచ్చి ఉండి ఉంటే వారిలో వారు పదవుల కోసం కుమ్ములాడుకొంటూ కాలక్షేపం చేసేవారు. కనుక వారి వలన టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ను బలహీనపరచడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న అత్యంత శక్తివంతమైన బిజెపిని చేజేతులా ఆహ్వానించి తెచ్చుకొన్నట్లయింది.
ఇప్పటికే ఒక్కో రాష్ట్రాన్ని వశం చేసుకొంటూ వస్తున్న బిజెపి తమ తదుపరి లక్ష్యం తెలంగాణలో అధికారంలోకి రావడమే అని ప్రకటించింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణలో బిజెపి వరుస విజయాలు సాధిస్తోంది. క్రమంగా బలపడుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ను ఓడించడం ఖాయం అని గట్టి నమ్మకంగా ఉంది.
ఒకవేళ ప్రజాస్వామ్యబద్దంగా టిఆర్ఎస్ను ఓడించడం సాధ్యం కాకపోతే, టిఆర్ఎస్లో కట్టప్పల సాయంతోనైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని బిజెపి బహిరంగంగానే హెచ్చరిస్తోంది. కనుక చచ్చినపాము వంటి కాంగ్రెస్ పార్టీని చంపి, వేయి తలల విషసర్పం వంటి బిజెపిని చేజేతులా తెచ్చి పక్కలో పెట్టుకొన్నట్లయింది. కనుక బిజెపి కాటు నుంచి ఏవిదంగా తప్పించుకోవాలి?దానిని ఏవిదంగా ఎదుర్కోవాలి?అనేది సిఎం కేసీఆర్కు అగ్నిపరీక్షే అని భావించవచ్చు.



