భాగ్యనగర వాసుల కల సాకారం కాబోతోంది. గత కొన్నేళ్ళుగా నగర వాసులను ఊరిస్తోన్న హైదరాబాద్ మెట్రో రైలు పరుగుకు సిద్ధమవుతోంది. 2019 జనవరి 3వ తేదీ నుండి కూత పెట్టడానికి సర్వం సన్నద్ధమవుతున్నాయి. తొలుత రెండు కారిడార్లలో ప్రారంభం కానున్న మెట్రో సేవలను, దశల వారీగా విస్తరించనున్నారు. జనవరి 3న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోయే మెట్రో రైలును నాగోల్-బేగంపేట, మియాపూర్-అమీర్పేట కారిడార్లలో అందుబాటులోకి రానున్నాయి.
జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైలును ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కారణంగానే నగరంలో పనులు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేసి, ట్రాఫిక్ ను మళ్లించి మరీ రాత్రీ, పగలు అన్న తేడా లేకుండా పనులు చేస్తున్నారు. అమీర్పేట, సికింద్రాబాద్ లోని ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ ను దారి మళ్లించి పనులు పూర్తి చేస్తున్నారు. ఒలిఫెంటా వద్ద ఏర్పాటు చేస్తున్న ఉక్కు వంతెన నిర్మాణం పూర్తయితేనే నాగోలు నుంచి బేగంపేట మార్గంలో రైలు నడిపే అవకాశం ఉంది.
నవంబరు కల్లా మిగిలిన పనులు పూర్తి చేసి డిసెంబరులో ట్రయల్స్ నిర్వహించి జనవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమీర్ పేట వద్ద రైలు మార్పిడి స్టేషన్ నిర్మించాల్సి ఉంది. దీని నిర్మాణాన్ని కొనసాగిస్తూనే మియాపూర్-అమీర్పేట మధ్య రైలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, నగరంలోని మిగతా రూట్లలోనూ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం మూడు కోచ్ లతో ఉన్న 53 మెట్రో రైళ్లు నగరానికి చేరుకున్నాయి.


