ఈ నెల 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మరో వారం రోజులలో పోలింగ్ జరుగబోతుంటే, కొన్ని వార్తలు బిఆర్ఎస్ పార్టీ ఓటమిని సూచిస్తున్నాయి.
తెలంగాణ ఇంటలిజన్స్ చేత తరచూ సర్వేలు చేయించుకొని ప్రజల నాడీ తెలుసుకొనే అలవాటున్న కేసీఆర్కు తాజా నివేదిక షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీస్తోందని, ప్రజలు మార్పు కోరుకొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది.
దీంతో అప్రమత్తమైన కేసీఆర్ ఈ నెల 20వ తేదీన కేసీఆర్ ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్తో ప్రగతి భవన్లో రహస్యంగా భేటీ అయ్యారు. ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లాష్ సర్వే నిర్వహించి, ఇంటలిజన్స్ నివేదికలో పేర్కొన్నదే జరుగబోతోందని తేల్చి చెప్పారు.
కానీ ఇప్పటికిప్పుడు ప్రజల ఆలోచనలను మార్చడం కష్టం కనుక మిగిలిన ఈ 10 రోజులలో బిఆర్ఎస్ పార్టీకి కనీసం గౌరవ ప్రదమైన సీట్లు సాధించుకొనేందుకు ఏమేమి చేయగలరో అవి చేసుకొంటే మంచిదని ప్రశాంత్ కిషోర్ కేసీఆర్కు సూచించారని ఈ వార్తల సారాంశం.
మంత్రి కేటీఆర్ తన పోటీ చేస్తున్న సిరిసిల్లా నియోజకవర్గంలో బిఆర్ఎస్ కౌన్సిలర్లతో మాట్లాడిన ఓ ఫోన్ సంభాషణ మీడియాకు లీక్ అయ్యింది. ఇది బిఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
“ఈసారి మన పార్టీ ఓడిపోతుందని ప్రజలు అనుకొంటున్నారట కదా?అంటూ మనవాళ్ళే మాట్లాడుతున్న ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలతో పార్టీకి ఎంత నష్టం జరుగుతోందో ఎవరూ గ్రహించడం లేదు. కాంగ్రెస్ నేతలు ఏదో మాట్లాడితే దానిని పట్టుకొని మనం ఓడిపోతామని అనుకొంటే మన పార్టీని మనమే ఓడగొట్టుకొంటున్నామని పార్టీలో అందరూ గ్రహించాలి.
కనుక అందరూ ఈ పనికిమాలిన మాటలు కట్టిపెట్టి మిగిలిన ఈ వారం రోజులు సిరిసిల్లాలో ఇంటింటికీ వెళ్ళి అందరికీ నచ్చజెప్పాలి. ఒకవేళ ఎవరైనా అసంతృప్తిగా ఉంటే వారితో నేనే స్వయంగా మాట్లాడుతానని వారికి నచ్చ జెప్పండి. మనకి ఈ వారం రోజులు చాలా కీలకం. కనుక అందరూ ఇంటింటికీ వెళ్ళి ప్రజలతో మాట్లాడి ఒప్పించండి,” అంటూ మంత్రి కేటీఆర్ ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది.
ప్రశాంత్ కిషోర్తో సిఎం కేసీఆర్ భేటీ అయ్యారనే వార్త, ఈ ఫోన్ సంభాషణ రెండూ మీడియా, సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వెంటనే వీటిని అందిపుచ్చుకొని కేసీఆర్ ఓడిపోబోతున్నారంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ధాటికి బిఆర్ఎస్ పార్టీ నిలువలేకపోతోంది.
మొదట్లో బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పిన సర్వేలే ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీకి 72-76 సీట్లు వస్తాయని, ఆ తర్వాత కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ఇంచుమించు సరిసమానంగా వస్తాయని కనుక హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే విజయావకాశం ఉందని సూచిస్తున్నాయి.
లోక్పోల్ తాజా సర్వే నివేదికలో కాంగ్రెస్: 69-72, బిఆర్ఎస్: 36-39, మజ్లీస్: 5-6, బీజేపీ: 2-3 సీట్లు లభించవచ్చని పేర్కొంది. తెలంగాణ శాసనసభలో 119 సీట్లు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకి కనీసం 60 సీట్లు అవసరం.
కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని చాలా తీవ్ర పదజాలంతో విమర్శించారు. దానిని కూడా కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకొని ప్రచారం చేసుకొంటుండటం చాలా గమ్మత్తుగా ఉంది.
బిఆర్ఎస్ ఓడిపోబోతోందని కేసీఆర్ కూడా గ్రహించారు కనుకనే రేవంత్ రెడ్డి పేరు పలకడానికే ఇష్టపడని ఆయన రేవంత్ రెడ్డిని పేరుపెట్టి దూషించారని కాంగ్రెస్ ప్రచారం చేసుకొంటోంది.
ఈ వార్తలు, ఫోన్ సంభాషణలు లీకులు, కాంగ్రెస్కు అనుకూలంగా వస్తున్న సర్వే నివేదికలు, సోషల్ మీడియాలో ప్రచారం వగైరాలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఇవన్నీ ఎన్నికలకు ముందు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాటితో బిఆర్ఎస్ పార్టీకి మరింత నష్టం జరుగుతుందని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈసారి కాంగ్రెస్ వ్యూహాలతో అపార చాణక్యుడు వంటి కేసీఆర్ చిత్తవబోతున్నారా?అనే సందేహం కలుగుతోంది.




