‘నేను… శైలజ…’ సినిమా ద్వారా టాలీవుడ్ తెరకు పరిచయమైన కీర్తి సురేష్, ఈ ఏడాది నానితో కలిసి “నేను లోకల్” అనే మరో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ, ‘మహానటి’ సావిత్రి బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తోంది. టాలీవుడ్ నాట ‘హిట్ హీరోయిన్’గా పేరు తెచ్చుకోవడంతో భారీ క్రేజ్ ఏర్పడిన ఈ ముద్దుగుమ్మనే ప్రిన్స్ చిత్రంలో తదుపరి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా ఈ రోజు ప్రారంభమైన సినిమాలో ప్రిన్స్ పక్కన కీర్తి సురేష్ ను ఫైనల్ చేసారన్న టాక్ బలపడుతోంది. దీనికి ప్రధాన కారణం… ఈ సినిమాను నిర్మిస్తోన్న రెండు ప్రధాన సంస్థలు వైజయంతీ మరియు దిల్ రాజు బ్యానర్లలో కీర్తి సురేష్ నటించడం. దిల్ రాజు నిర్మించిన ‘నేను లోకల్’ సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటించగా, ప్రస్తుతం అశ్వనీదత్ కుమార్తెలు నిర్మిస్తున్న ‘మహానటి’లో హీరోయిన్ కీర్తినే కావడంతో… ఈ భామనే ఫైనల్ చేసారని తెలుస్తోంది.
అధికారికంగా ఇంకా ఈమె పేరు డిక్లేర్ చేయలేదు గానీ, సంప్రదింపులు అయితే పూర్తయ్యాయని టాక్. అయితే ఒక్కసారి తను కమిట్ అయితే, ఆ సినిమా అధికారిక సమాచారాన్ని కీర్తి సురేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న వైనం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది గనుక, బహుశా ఇప్పుడే ఈ అఫిషియల్ న్యూస్ వెల్లడి కాకపోవచ్చు. అయితే ప్రిన్స్ పక్కన కీర్తి అదిరిపోతుంది… వీరిద్దరి జోడి కన్నులవిందు చేయడం ఖాయం… అంటున్నారు అభిమానులు.


