ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు టికెట్లు దక్కని రాజకీయ నాయకులు పార్టీలు మారడం సహజమే. టిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నానిని పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పేయడంతో ఆయనను వైసీపిలోకి తెచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్దమవుతున్నారు.
ప్రస్తుతం ఆయనకు వేరే దారి లేదు కనుక వైసీపిలో చేరేందుకు సిద్దపడిన్నట్లు తెలుస్తోంది. ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్తో పాటు, ఆయన అనుచరులకు మరో రెండు ఎమ్మెల్యే టికెట్స్ కూడా ఇచ్చేందుకు వైసీపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈరోజు వైసీపి మూడో జాబితా విడుదలైతే దీనిపై స్పష్టత వస్తుంది.
జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పినందుకు అలిగిన పెనమలూరు వైసీపి ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పేసి టిడిపిలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మంగళవారం రాత్రి వైసీపి సీనియర్ నేతలు అయోధ్యా రామిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఆయనతో సమావేశమయ్యి బుజ్జగించేందుకు ప్రయత్నించారు.
కానీ నాలుగున్నరేళ్ళలో మాట నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల తర్వాత మాట నిలబెట్టుకొంటారనే నమ్మకం ఏమిటి?ఒకవేళ ఆయన మళ్ళీ మాట తప్పితే ఎవరిని అడగాలి? అంటూ ఆయన వారిని ఎదురు ప్రశ్నించిన్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి నమ్మి మోసపోయానని మళ్ళీ మోసపోదలచుకోలేదని, తాను టిడిపిలో చేరబోతున్నట్లు పార్ధసారధి తేల్చి చెప్పేసిన్నట్లు తెలుస్తోంది.
ఆయనతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్న టిడిపి నేతలు బుధవారం ఉదయం మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి నూజివీడు టికెట్ ఆఫర్ చేయగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది. అయితే పార్ధసారధి చేరికపై ఇంకా అధికారిక ప్రకటన రావలసి ఉంది.
అయితే రెండు పార్టీలలో ఈ కొత్త చేరికల వలన ఆయా స్థానాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న నేతలకు షాక్ తగులుతుంది. కనుక వారు తీవ్ర అసంతృప్తితో పార్టీలు వీడటం కూడా ఖాయమే.




