ఇటీవల చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్లో జగన్ ప్రభుత్వానికి సున్నితంగా చురకలు వేయడంతో మంత్రులు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏ స్థాయిలో ఆయనపై విరుచుకు పడ్డారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే నేడు చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకొని కొడాలి నాని గుడివాడలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సందర్భంగా ఆయన తాను చిరంజీవిని ఎన్నడూ విమర్శించలేదన్నారు. తాను చిరంజీవిని విమర్శించిన్నట్లు దమ్ముంటే నిరూపించాలని సవాలు విసిరారు.
ఇంకా ఏమన్నారంటే, “చిరంజీవి ఎవరి జోలికి వెళ్ళని పెద్దమనిషి. అలాంటి వ్యక్తిని నేనెందుకు తిడతాను? నేను అంత సంస్కార హీనుడుని కాను. ఆయనకు, మాకు మద్య గ్యాప్ సృష్టించాలని అభిమానుల ముసుగులో టిడిపి, జనసేనలు కుట్రలు చేశాయి. నేను ‘ఇండస్ట్రీలో పకోడీ గాళ్ళు’ అని చిరంజీవిని ఉద్దేశ్యించి అనలేదు. సరిగ్గా నటించడం, డ్యాన్స్ చేయడం చేతకాని పవన్ కళ్యాణ్ని ఉద్దేశ్యించి ఆ మాట అన్నాను.
అయితే సిఎం జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే, వారు ఎంతటివారైనా మేము చీల్చి చెండాడుతాము. చిరంజీవి మంచి ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వానికి సూచనలు చేశారు తప్ప విమర్శించారని నేను అనుకోవడం లేదు. నాతో సహా నా అనుచరులలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులమే. చిరంజీవి అంటే మాకు చాలా గౌరవం. అభిమానం. అందుకే ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకొంటున్నాము,” అని అన్నారు.
చిరంజీవి ఏపీలో రోడ్ల పరిస్థితి, ప్రత్యేకహోదా గురించి చురకలు వేయగానే కొడాలి నాని స్పందిస్తూ, “ఇండస్ట్రీలో కొందరు పకోడీగాళ్ళు మాకు ప్రభుత్వం ఎలా నడపాలో సలహాలు ఇస్తున్నారు,” అని అన్నారు. అంటే అది చిరంజీవిని ఉద్దేశ్యించి అన్న మాటలే అని అర్దమవుతోంది.
గుడివాడ ఓటర్లలో చాలామంది చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులే ఉన్నారనే విషయం కొడాలి నానికి ఇప్పటికీ గుర్తువచ్చిన్నట్లుంది. అందుకే ఇలా సంజాయిషీ ఇచ్చుకొంటూ కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు.
ఆయన చిరంజీవిని తిట్టలేదని సరిపెట్టుకొన్నా నిత్యం పవన్ కళ్యాణ్ని అవహేళన చేస్తూనే ఉంటారు. “నేను చిరంజీవి అభిమానిని కానీ పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చిన్నట్లు తిడతుంటాను,” అంటే మెగా అభిమానులు సహిస్తారనుకోవడం అవివేకం కాదా?
రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి సినీ ప్రముఖులందరినీ నోటికి వచ్చిన్నట్లు దూషిస్తున్నందుకు, చిరంజీవి చేత చేతులు జోడింపజేసుకొని ఆ ఫోటోలను మీడియాకు విడుదలచేసి ఆయనని అవమానించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది అభిమానులను వైసీపీ నేతలు చేజేతులా దూరం చేసుకొన్నారు. వచ్చే ఎన్నికలలో దానికి వారు మూల్యం చెల్లించక తప్పదు.
కనుక ఇప్పుడు కేక్ కట్ చేసి హడావుడి చేస్తే కొడాలి నాని మాటలను అభిమానులు నమ్మేస్తారనుకోవడం అవివేకమే. వైసీపీ నేతలు ఇదివరకు చిరంజీవిని పొగిడిన నోటితోనే విమర్శించారు. కనుక ఇప్పుడు మళ్ళీ పొగిడిన రేపు మళ్ళీ తిట్టరనే నమ్మకం లేదు. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వైసీపీ నేతలు ఆయనను చీల్చిచెండాడకుండా ఉంటారా?అప్పుడూ కొడాలి నాని నేను చిరంజీవి అభిమానినని నోరు మూసుకొని కూర్చొంటారా?



