నిన్న టీడీపీ – జనసేన నిర్వహించిన ఉమ్మడి సభలో జగన్ పై పవన్ పేల్చిన విమర్శల బాంబులు కు కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి ఎంతమంది నాయకులు వచ్చారో చూస్తే ఒక్కడికోసం ఇంతమందా…? అని అనాల్సిందే.
నా గురించి విమర్శించడానికి జగన్ కు రెండు విడాకులు, మూడు పెళ్లిళ్లు అనే ఒక్కటే అంశం ఉంది. కానీ జగన్ గురించి నేను మాట్లాడనుకుంటే నాకు టన్నుల్లో సమాచారం ఉంది. కానీ నా సంస్కారం అడ్డంవచ్చి ఆగుతున్నా అంతే, నాకు లేని నాలుగో భార్య నువ్వా జగన్..?, నిన్ను పాతాళానికి తొక్కే వామనుడ్ని నేనే అంటూ జగన్ మీద రెచ్చిపోయిన పవన్ కు కౌంటర్ వేయడానికి జగన్ స్వామి భక్తి చూపించుకోవడానికే వైసీపీ నాయకులు ఒక్కక్కొరుగా మీడియా ముందుకు వచ్చారు.
ముందుగా జగన్ దగ్గర నేను పెద్దపాలేరు అని సగర్వంగా చెప్పుకున్న మాజీమంత్రి పేర్నినాని…నువ్వు వామనుడివి కాదు శల్యుడివి..,శికండివి. సినిమా వాళ్ళ స్క్రిప్టులు తెచ్చి రాజకీయ వేదికల మీద చదివే నువ్వు కూడా జగన్ ను విమర్శిస్తున్నావా పవన్ .? అంటూ స్క్రిప్ట్ పేపర్ లేకపోతే ప్రత్యర్థులను ఒక్క మాట కూడా అనలేని వ్యక్తి కోసం పేర్నినాని ముందుకొచ్చారు.
అలాగే కొబ్బరిచిప్పల మంత్రిగా పేరు సంపాదించుకున్న మరో మాజీ వెల్లంపల్లి వచ్చి…గత ఎన్నికలలో సీఎం జగన్ నిన్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదు అయినా పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం అంటూ త్వరలో పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండు పవన్ అంటూ సెలవిచ్చారు.
వైసీపీ మరో మాజీ బూతుల మంత్రి గా పాపులర్ అయిన కొడాలి నాని…, అసలు పవన్ కు ఓటుబ్యాంకు లేదన్న వైసీపీ నేతల వ్యాక్యలకు విరుద్ధంగా నాని పవన్ ఓటు బ్యాంకు తో బాబు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే గా గెలవడానికి ఒకరు…సీఎం గా నెగ్గడానికి మరొకరు ఇలా ఒక్కరిపై ఒకరు ఆధారపడి జగన్ ను ఓడించాలనుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ రెచ్చిపోయారు.
ప్రస్తుత మంత్రి సంబరాల రాంబాబు గా చెప్పుకుంటున్న అంబటి రాంబాబు…., పవన్ రాజకీయాలకు సరిపోయే వ్యక్తి కాదని, పోల్ మేనేజ్ మెంట్ కూడా చేతకాని పవన్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి స్తానం కోసం ఆశ పడడం అత్యాశే అవుతుంది అంటూనే తనకాలవైన కుల వివాదాలు తేరా మీదకు తెచ్చారు. కాపు నేత అయిన రంగాను చంపినప్పుడు లేని బాధ…బాబు ని అరెస్టు చేసినప్పుడు వచ్చిందా..? అంటూ లాజిక్ లెస్ ప్రశ్న వేశారు అంబటి.
అసలు రంగా చనిపోయిన సమయంలో పవన్ వయస్సు ఎంతా..? ఆ వయస్సులో రాజకీయ అవగాహనా ఉంటుందా..? చిన్న వయస్సు నుండి కూడా కుల రాజకీయాల మీద అవగాహన పెంచుకోవాలని అంబటి భావిస్తున్నారా..? లేక నేటి తరం కూడా కులాల కుమ్ములాటల్లో నలిగిపోవాలని ఆశపడుతున్నారా..? ఇలా ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇంతమంది నాయకులు మీడియా ముందు వస్తున్నారంటేనే అర్ధమవుతుంది ఆ ఒక్కడి బలమెంత అనేది అంటున్నారు జనసైనికులు.
ఇంతకీ ఈ వైసీపీ నాయకుల మేకపోతు గాంభీర్యాలు బయపెట్టాలనా..? బెదిరించాలనా..? ఇక తగ్గేది లేదు…యుద్ధమే అంటూ అంటూ ముందడుగు వేస్తున్న కూటమిని ఎదుర్కోవడానికి వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు, లక్షల్లో ఉన్న వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, సోషల్ మీడియాలో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న తన కాలకేయ సైన్యం, అధికార యంత్రాగం…ఇలా ఇంతమందిని పెట్టుకుని నేను ఒంటరిని అంటూ జగన్ చెప్పే కల్లబుల్లి కబుర్లు నమ్మడానికి ప్రజలు సిద్ధమా..?





