టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయ్యి నేటికీ నెలరోజులు పూర్తయింది. ఆయన అవినీతికి పాల్పడిన్నట్లు నిరూపణ కాకపోయినా బెయిల్ లభించకపోవడం, నెలరోజులుగా జ్యూడిషియల్ రిమాండ్ పొడిగిస్తూనే ఉండటం చూస్తే, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నట్లు అనుమానం కలుగుతోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు కోళ్ళు రవీంద్ర అన్నారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాంనగర్లో ఆయన రిలే నిరాహారదీక్షలో పాల్గొనప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “జగన్ రూ.43,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సాక్షాత్ సీబీఐ ఆరోపించింది. అక్రమాస్తుల కేసులో 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉంది బెయిల్పై బయట ఉంటూ నేటికీ ఆ కేసులు ముందుకు కదలనీయకుండా చక్రం తిప్పుతున్నారు.
పదేళ్ళుగా బెయిల్పై ఉన్న ఆయనపై 11 చార్జ్ షీట్లున్నాయి. 38 కేసులలో నిందితుడుగా ఉన్నారు. జైలుకి వెళ్ళి బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఆయనపై అన్ని కేసులు పెండింగులో ఉన్నా కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థలు, సీబీఐ, ఈడీ ఏవీ కూడా ఏమీ చేయలేకపోతున్నాయంటే ఆయన ఎంత గొప్పగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో అర్దంచేసుకోవచ్చు.
ఇన్ని కేసులున్న జగన్మోహన్ రెడ్డిపై చర్యలు ఉండవు కానీ ఆరోపణలు నిరూపణ కాకముందే చంద్రబాబు నాయుడుని జైల్లో వేస్తారు. కనీసం బెయిల్ కూడా లభించకుండా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నాను,” అని కొల్లు రవీంద్ర నిలదీశారు.



