ఉత్తరాంధ్రలో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ తెలుగుదేశం వైపుగా అడుగులు వేస్తున్నారా అంటే అవును అనే సమాచారం వస్తుంది. గతంలో ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. ఆ తర్వాత వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో ప్రముఖంగా పనిచేశారు. ఎన్నికల తరువాత జగన్ పై తీవ్రమైన ఆరోపణలు చేసి పార్టీ నుండి బయటకు వచ్చారు. ఆ తరువాతి కాలంలో రాజకీయాలకు దూరం అయ్యారు. ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేస్తుండే వారు. ఒక సమయంలో ఆయన జనసేనకు దగ్గరగా జరుగుతున్నారని వార్తలు వచ్చాయి.
[m9ad]
పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయాలలో ఆయన సలహా తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రతిపక్షాల మధ్య అనైక్యత అధికార టీడీపీకి అనుకూలంగా మారుతుందని.. టీడీపీకి కాంగ్రెస్ మిత్రపక్షంగా మారగా.. వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ తదితర పార్టీలన్నీ ఎవరిదారిన వారు వెళ్తున్నారని.. అందువల్ల టీడీపీ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండవచ్చని ఆయన అంచనా వేస్తున్నారట. అదే సమయంలో ఎన్నికల అనంతరం బీజేపీ తెరవెనుక ఉండి వైసీపీ, జనసేన మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం కూడా ఉందని రామకృష్ణ అంచనా వేస్తున్నారు.
ఆయన మాట తీరును బట్టి టిడిపిలో చేరతారా అన్న చర్చకు ఆస్కారం వస్తోంది. ఇప్పటివరకు రాజకీయంగా యాక్టీవ్ గా లేకపోయినా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో ఆయనను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావడానికి జనసేన కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆ పార్టీని నాయకత్వ లేమి పట్టి పీడిస్తుంది. నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు వంటి వారిని కూడా అందుకే పార్టీలో జాయిన్ చేసుకుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి కొందరిని పార్టీలోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తుంది.



