తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానానికి తిరుమల తరహాలో 18 మందితో (వైటిడి) పాలక మండలిని ఏర్పాటు చేసింది.
రెండేళ్ల పదవీకాలంతో పనిచేసే ఈ యాదాద్రి ప్పాలక మండలికి ఎంఎస్ఎన్ గ్రూప్ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డిని ఛైర్మన్గా నియమించింది.
కార్మిక శాఖ మంత్రి జీవీ వివేక్ వెంకటస్వామితో పలువురు ప్రముఖులకు దీనిలో స్థానం కల్పించారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కూడా ఒకరు!
తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రా రాజకీయ నాయకులు పెత్తనం చలాయించాలని చూస్తున్నారని, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కనుసన్నలలో పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే వాదిస్తున్నాయి.
కనుక వైటిడీ బోర్డు సభ్యురాలుగా కొణిదెల సురేఖని నియమించడంపై బహుశః అభ్యంతరం చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలలో గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆమె నియామకంపై తప్పక అభ్యంతరం చెప్పవచ్చు.
అయితే టిటిడీలో తెలంగాణతో సహా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందినవారిని సభ్యులుగా నియమిస్తుంటుంది ఏపీ ప్రభుత్వం. అదేవిధంగా వైటీడిలో కూడా నియమించడం సబబే. ఒకవేళ బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు వైటీడి పాలక మండలి సభ్యుల నియామకాలపై విమర్శిస్తే ప్రభుత్వం వద్ద సమాధానం సిద్ధంగానే ఉంది.
ఈవిషయం బీఆర్ఎస్, టీఆర్ఎస్ రెండు పార్టీలకు బాగా తెలుసు. కనుక ఈ నియామకాన్ని ‘తెలంగాణపై ఆంధ్రా పెత్తనం’ అనే తమ కోణంలోనే వాదిస్తూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ చేయకపోతే విజ్ఞత ప్రదర్శించినందుకు సంతోషించాలి.





