“బాబాయ్, తల్లి, చెల్లీ అందరూ జగన్ బాధితులే… అటువంటిది నన్ను వదిలేస్తారనుకుంటానా?” అని నెల్లూరు రూరల్ టీడీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. తనని హత్య చేస్తే భారీగా డబ్బు (సుపారీ) లభిస్తుందని ముగ్గురు యువకులు మాట్లాడుకున్న వీడియో వైరల్ అవడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దానిపై స్పందిస్తూ మీడియా సమావేశంలో ఈ ప్రశ్న అడిగారు. తాను వైసీపీలో ఉన్నప్పుడే బోరుగడ్డ అనిల్ కుమార్ ఈవిదంగా బెదిరించేవారని కానీ అప్పుడే తాను భయపడలేదని ఇప్పుడు భయపడతానని ఎలా అనుకున్నారు?అని ప్రశ్నించారు.
“నేను విద్యార్ధి దశ నుంచే అనేక పోరాటాలలో పాల్గొన్నాను. అనేకసార్లు ఇటువంటి బెదిరింపులు, ప్రాణాపాయం కూడా ఎదుర్కొన్నాను. అయినా ఎన్నడూ భయపడలేదు. వెనక్కు తగ్గలేదు. ఎందుకంటే ఏదో రోజూ అందరూ పోవలసిన వాళ్ళమే.
కనుక బ్రతికి ఉన్నప్పుడు నాలుగు మంచి పనులు చేసి నలుగురి చేత ఔననిపించుకొని పోవడమే మంచిదని నేను భావిస్తాను. ఆ ప్రకారమే జీవిస్తున్నాను,” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
తన తమ్ముడు గిరిధర్ రెడ్డి తనను హత్య చేయించడానికి కుట్ర పన్నుతున్నాడనే పుకార్లపై కూడా ఆయన స్పందిస్తూ, “హత్యా రాజకీయాలు వైసీపీకి అలవాటు. అదే అలవాటు అందరికీ ఉంటుందనుకోవడం అవివేకం.
నాకు నా తమ్ముడికి మద్య ఈవిదంగా చిచ్చు పెట్టేందుకు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదని నాకు తెలుసు. కనుక ఈ ఉచ్చులో మేము చిక్కుకోము,” అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడిగారు. “నన్ను హత్య చేయాలనే కుట్ర జరుగుతోందని జూలై 1నే మీకు తెలిస్తే ఇంతకాలం నాకు చెప్పకుండా, నన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించకుండా ఎందుకు ఊరుకున్నారు? నన్ను చంపేస్తే సుపారీ ఇస్తానన్న ఆ వ్యక్తి ఎవరు?తెలుసుకున్నారా లేదా?” అని ప్రశ్నించారు.





