ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పరిస్థితులు, ప్రభుత్వ విధానాలలో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అందరికీ తెలుసు. చివరికి ప్రతిపక్ష నేతల భద్రత విషయంలో కూడా రెండు ప్రభుత్వాల స్పందన భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి జెడ్ క్యాటగిరీ భద్రత అవసరంలేదని జగన్ ప్రభుత్వం వాదిస్తుంది. ఆయన జిల్లా పర్యటనలు చేస్తున్నప్పుడు ఆయనపై వైసీపీ కార్యకర్తలే రాళ్ళు విసురుతుంటారు. టిడిపి యువనేత నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో మరో ప్రతిపక్షనేత పవన్ కళ్యాణ్ తన ప్రాణాలకు ప్రమాదం ఉందని బహిరంగంగా చెప్పినా ప్రభుత్వం స్పందించదు.
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాదినేని యామినీ శర్మకు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల ఫోటోలను సర్క్యులేట్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
కొండెపి నియోజకవర్గంలో ఓ వైసీపీ నాయకుడు అంగన్వాడీ టీచరుని పట్టపగలు ట్రాక్టరుతో ఢీకొట్టి తొక్కించి చంపేస్తే ప్రభుత్వం, పోలీసులు స్పందించలేదని హైకోర్టు న్యాయవాది రజని ఆరోపించారు. ఏపీలో మహిళా కమీషన్ కేవలం అధికార వైసీపీ కోసమే పనిచేస్తుందా లేక రాష్ట్రంలో మహిళలందరి కోసం పనిచేస్తుందో తెలీదని వారన్నారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే అక్కడ హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను హత్య చేసేందుకు అధికార బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పధకం రచిస్తున్నారని ఈటల రాజేందర్ భార్య జమున మంగళవారం హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ వెంటనే డిజిపి అంజని కుమార్కు ఫోన్ చేసి ఈటలకు భద్రత పెంచాలని ఆదేశించారు.
ఆయన కూడా వెంటనే స్పందిస్తూ ఈరోజు ఉదయమే ఓ సీనియర్ ఐపిఎస్ అధికారిని ఈటల రాజేందర్ ఇంటికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు సంసిద్దత వ్యక్తం చేయగా, రాష్ట్ర ప్రభుత్వమే ఆయనకు భద్రత కల్పిస్తుందని, ఆయన భద్రతకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ప్రతిపక్ష నేతల భద్రత విషయంలో కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల వైఖరిలో ఇంత వ్యత్యాసం ఉండటం విశేషమే కదా?



