ఏపీకి ఓ కోడి, గుడ్డు మంత్రి ఉన్నారుగా… కేటీఆర్‌ రికమండేషన్ ఎందుకు?

KTR Recommends Information Technology Companies To Andhra Pradeshఏపీ, తెలంగాణ మంత్రులు పక్క రాష్ట్రం గురించి ఏమి మాట్లాడినా అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈరోజు తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ శివారులోని మణికొండ ఐ‌టి పార్టులో రూ.40 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “నేను తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు సాధించేందుకు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది ఏపీలో కూడా ఐ‌టి కంపెనీలు ఏర్పాటయ్యేలా చేయమని అభ్యర్ధిస్తున్నారు. తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఐ‌టి కంపెనీలు రావలసిన అవసరం ఉంది. నెల్లూరు, భీమవరంలో ఐ‌టి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు కొందరు ఆసక్తి చూపిస్తున్నారు. నేను ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డితో మాట్లాడి వారికి అక్కడ ఐ‌టి కంపెనీలు పెట్టేందుకు స్థలాలు ఇప్పిస్తానని చెప్పాను.

ADVERTISEMENT

ఏపీలో కూడా ఐ‌టి రంగంలో మంచి నైపుణ్యం ఉన్న పిల్లలు చాలా మందే ఉన్నారు. బెంగళూరులోని ఐ‌టి కంపెనీలలో 40శాతం తెలుగువాళ్ళే పనిచేస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా ఐ‌టి కంపెనీలు రావాలి. ఏపీ, తెలంగాణలతో సహా దేశం అంతా బాగుపడాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.

త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నందున ఇప్పుడు తెలంగాణ మంత్రులు ఏపీ గురించి మాట్లాడుతున్నారని నందమూరి బాలకృష్ణ అన్న మాట వాస్తవం. కనుక ‘నాన్న పులొచ్చే’ అన్నట్లు ఇప్పుడు కేటీఆర్‌ నిజంగానే ఏపీలో ఐ‌టి కంపెనీలు రావాలని కోరుకొంటున్నా నమ్మలేని పరిస్థితి.

ఆనాడు చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మించాలని, ఏపీకి ఐ‌టి కంపెనీలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనను గద్దె దించడానికి కేసీఆర్‌ కూడా ఓ చెయ్యివేశారని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఏపీ నుంచి పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు తెలంగాణకు తరలిపోవడం అందరూ కళ్ళారా చూశారు. అవి ఎందుకు తరలిపోయాయో, కొత్తవి ఎందుకు రావడం లేదో కూడా అందరికీ తెలుసు. కనుక ఏపీలో ఐ‌టి కంపెనీలు ఏర్పాటు గురించి కేటీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. అయినా ఏపీకి ఓ ఐ‌టి, పరిశ్రమల శాఖ, దానికో మంత్రి ఉన్నారు కదా?కనుక కోడి, గుడ్డు కధ వేరెవరో చెప్పాలా?

ADVERTISEMENT
Latest Stories