#ASKKTR అంటూ ట్విట్టర్ లో కేటీఆర్ చేసే హుంగామా మనకు తెలియనిది కాదు. తెరాస అభిమానులు ఆయనను పొగడ్తలతో ముంచెత్తడం, రాజకీయ శత్రువులకు ఆయన ఘాటైన కౌంటర్లు వెయ్యడం పరిపాటి అయితే ఈ సారి మాత్రం అది కొంచెం భిన్నంగానే సాగింది. కేటీఆర్ ను చాలా మంది నెటిజన్లు ఇటీవలే జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల గోల్ మాల్ గురించి ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టారు. వివాదాలకు కేంద్ర బిందువైన సంస్థకు కేటీఆర్ కు ఉన్న లింకులపై ప్రశ్నలు అడిగారు.
“వీటిపై నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? జరిగింది బాధాకరం బాధ్యులను శిక్షించాలి. ఒక విద్యార్థికి తండ్రిగా వారి బాధను నేను అర్ధం చేసుకోగలను. గవర్నమెంట్ ఒక కమిటీని నియమించింది. దాని రిపోర్టును బట్టి బాధ్యులపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది,” అని ఆయన చెప్పుకొచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆయన మీద ఆరోపణలు చెయ్యడంతో ఒక వ్యక్తికి ఈ విషయాన్ని ఇంత కన్నా జటిలం చెయ్యవద్దు అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పడం గమనార్హం.
2014 ఎన్నికలలో విజయం సాధించిన నాటి నుండి రెండో సారి గెలిచిన తరువాత కేసీఆర్ ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టిన విషయం ఇదే అని చెప్పుకోవాలి. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఆలస్యంగా స్పందించడం కూడా ఒక కారణం అనే అనుకోవాలి. దీనితో తోడు విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదం గానే ఉంది. బోర్డు కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న వారిని ఏదో నక్సలైట్లు, టెర్రరిస్టులను ఆరెస్టు చేసినట్టు చేశారు.



