ఒకరిద్దరి లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు: కేటీఆర్‌ ఒప్పుకున్నట్లేనా?

ktr-brs-phone-tapping

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఒక డీఎస్పీ ప్రణీత్ రావు, ఇద్దరు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. మాజీ ఇంటలిజన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరుని ఈ కేసులో ఏ-1గా చేర్చారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి.

మొదట రేవంత్‌ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేశారనుకుంటే, రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలందరి ఫోన్లు, వారి సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన సంగతి మెల్లగా బయటపడుతోంది.

ADVERTISEMENT

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు తదితర నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించిన ఘనుడు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వల వేసి పట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయించి ఉంటారని వేరే చెప్పక్కరలేదు.

అయితే ప్రణీత్ రావు బృందం అక్కడితో ఆగలేదు. రాష్ట్రంలో నగల వ్యాపారులు, రియల్ ఎస్టేట్‌ వ్యాపారులు, హవాలా డీలర్లు ఇంకా చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి నుంచి డబ్బు గుంజుతుండేదని బయటపడింది.

ఆ డబ్బుతో ప్రభాకర్ రావుతో సహా పలువురు ఉన్నతాధికారులు గండిపేట తదితర ప్రాంతాలలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసి వాటిలో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారనే కొత్త విషయం కూడా బయటపడింది.

ఏపీలో తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ అవుతున్నాయని టిడిపి, జనసేన నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. కనుక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం ఏపీకి కూడా విస్తరించి ఉంటే, ఏపీలో ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో జైలుకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.

ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఇన్ని విషయాలు బయటపడుతుంటే, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈరోజు చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని పార్టీ నేతలతో మాట్లాడుతూ, “ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం ఏదో అంతర్జాతీయ కుంభకోణం అన్నట్లు రేవంత్‌ రెడ్డి, మంత్రులు మాట్లాడుతున్నారు.

ఒకవేళ చేస్తే గీస్తే… ఒకరిద్దరు లుచ్చాగాళ్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉండవచ్చు. పోలీసోళ్ళ పనే అది. కానీ రాష్ట్రంలో పది లక్షల ఫోన్లు ట్యాపింగ్ జరిగిపోయిందంటూ కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదో వంకతో మాపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు,” అని కేటీఆర్‌ అన్నారు.

ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చని కేటీఆర్‌ చెప్పడం ద్వారా ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం నిజమే అని స్వయంగా ధృవీకరించిన్నట్లయింది. ఆయన మాట వరసకి ఒకరిద్దరు అని ఉండవచ్చు. కానీ వాస్తవ సంఖ్య అందుకు లక్ష రెట్లు ఎక్కువగా ఉండొచ్చు.

అయినా కేసీఆర్‌, కేటీఆర్‌లకు తెలియకుండా, వారి అనుమతి, ఆదేశం లేకుండా నిఘా అధికారులు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ సాహసం చేయరు కదా? వారికి ఆ అవసరం కూడా ఉండదు కదా?

కనుక ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం చివరికి కేసీఆర్‌ మెడకు చుట్టుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. బహుశః ఈ విషయం పసిగట్టినందునే కేటీఆర్‌ ఇంత ఆవేశపడిపోతున్నారేమో?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న కల్వకుంట్ల కవిత కూడా ఇలాగే వాదిస్తున్నారు. కానీ ఏమైంది? తిహార్ జైలుకి వెళ్ళాక తప్పలేదు. చేయకూడని తప్పులన్నీ చేసి తాము కడిగిన ముత్యాలం, ఆణి ముత్యాలం అంటే జనం నమ్ముతారా? జనం నమ్మినా రేవంత్‌ రెడ్డి వంటి కేసీఆర్‌ బాధితులు విడిచిపెడతారా?

ADVERTISEMENT
Latest Stories