ఈసారి ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టిడిపి, జనసేన, బీజేపీలకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు, అభ్యర్ధులు పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు.
సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వైష్ణవ్ తేజ్, నాని, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, సంపూర్ణేష్ బాబు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి వంటి పలువురు సినీ నటులు పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటిచారు.
వీరిలో కొందరు సోషల్ మీడియా ద్వారా మద్దతు ప్రకటించగా మరికొందరు పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
జనసేనలో కీలకపాత్ర పోషిస్తున్న నాగబాబుతో పాటు తొలిసారిగా ఆయన సతీమణి పద్మజ కూడా పిఠాపురం వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. జబర్దస్ట్ షో ఆర్టిస్టులు ఇంకా అనేకమంది వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమని ముప్పతిప్పలు పెట్టినందున వారందరూ తపకుండా టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తారని వేరే చెప్పక్కరలేదు. కాస్త ఆలస్యంగానైనా అందరూ ధైర్యంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు పలుకుతున్నారు.
సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించడం ఆశ్చర్యం కాదు. కానీ హైదరాబాద్లో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుకొని జీవిస్తున్న ‘కుమారీ ఆంటీ’ కూడా గుడివాడ వచ్చి టిడిపి అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తుండటమే చాలా విశేషం.
పవన్ కళ్యాణ్ నిన్న ఎన్నికల ప్రచారంలో తమ కూటమి గురించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ చాలా ఘాటుగా జవాబు ఇచ్చారు. “మేమందరం కట్టకట్టుకొనివచ్చి ఒంటరిగా ఉన్న మీతో పోరాడుతున్నామని పదేపదే చెప్పుకుంటున్నారు. అయ్యా జగన్… మేము ప్రతిపక్ష పార్టీల వాళ్ళం. మేము గెలిచేందుకు కలిసి పోటీ చేస్తున్నాము. రాష్ట్రంలో ప్రతిపక్షాలున్నది మిమ్మల్ని గెలిపించడానికి కాదు కదా?” అని అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలు విని అందరూ గొల్లున నవ్వారు. నిజమే కదా?
జగన్ తాను తన పార్టీ గెలవాలనుకుంటే తన ప్రయత్నాలు తాను చేసుకోవడంలో తప్పు లేదు. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయాలని, పొత్తులు పెట్టుకోకూడదని, పెట్టుకుంటే అనైతికమని జగన్ వాదించడమే విడ్డూరంగా ఉంది.
ఓపక్క టిడిపి, జనసేన, బీజేపీ కూటమికి నానాటికీ మద్దతు, అభ్యర్ధులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంటే, ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ‘ఆశలు రోజు రోజుకీ సన్నగిల్లిపోతున్నాయి… విదేశాలకు వెళ్తామని’ చెప్పి అస్త్ర సన్యాసం చేసేశారు కూడా. కనుక వైసీపి ఓటమి ఇక లాంఛన ప్రాయమేనేమో?




