రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ వైపే అందరి చూపు ఉంది. కచ్చితమైన సర్వేలకు మారుపేరైన లగడపాటి ఎప్పటిలానే అందరిని సస్పెన్స్ లో పెడుతున్నారు. డిసెంబర్ 7న పోలింగ్ ముగిసిన తరువాత మాత్రమే తన సర్వే ఫలితాలు విడుదల చేస్తా అని చెబుతున్న రాజగోపాల్ ఈ ఎన్నికలలో రెబెల్స్గా బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థులు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు.
[m9ad]
అయితే అంతకు ముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు ఆయన. మహబూబ్నగర్ జిల్లాలో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ బోథ్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారని తెలిపారు. ఒకవేళ లగడపాటి చెప్పిన జోస్యం నిజమైతే తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇప్పటి నుండే ఈ అభ్యర్థుల మద్దతు కోసం ప్రధాన పార్టీలు భేరసారాలు మొదలు పెట్టె అవకాశం ఉంది.
జాదవ్ అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెబెల్ అభ్యర్థి. పార్టీ తరపున 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు ఆయన. శివ కుమార్ రెడ్డి మొన్నటివరకూ నారాయణపేట తెరాస ఇంఛార్జ్ గా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయనకు పార్టీ టిక్కెట్టు నిరాకరించింది. దీనితో ఆయన రెబెల్ గా పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికలకు పోలింగ్ జరగబోతుంది. డిసెంబర్ 11న ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సెప్టెంబర్ లో కేసీఆర్ శాసనసభ రద్దు చేసినప్పుడు తెరాస గెలుపు నల్లేరుపై బండి నడకే అని అందరూ అనుకున్నారు.
అయితే తరువాత పరిణామాల బట్టి మహాకూటమి కూడా గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమం ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో లగడపాటి సర్వేకు హై డిమాండ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఆయన పేరిట ఏ పార్టీకి ఆ పార్టీ వారు అనుకూలంగా సర్వేలు సృష్టించి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఏదైనా ప్రధాన మీడియా ముందు తనంతట తాను వచ్చి ప్రకటిస్తే గానీ ఎవరూ ఇటువంటి వాటిని నమ్మవద్దని ఆయన ఇప్పటికే చెప్పుకొచ్చారు.



