స్వర్గీయ నందమూరి తారకరామారావు భార్యనని చెప్పుకొంటూ సమాజంలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్న లక్ష్మీ పార్వతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. “స్వర్గీయ ఎన్టీఆర్ భార్య అనేది ఏమైనా అదనపు అర్హతగా భావిస్తున్నారా? ఏ అర్హతతో చంద్రబాబు నాయుడు ఆస్తుల గురించి వివరాలు కావాలని అడుగుతున్నారు?అసలు ఒకరి ఆస్తుల గుర్తించి తెలుసుకోవలసిన అవసరం మీకెందుకు?ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలి?” అంటూ గట్టిగా చీవాట్లు పెట్టి ఆమె వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
మొదట ఆమె హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడా ఇంచుమించు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. చంద్రబాబు నాయుడుతో ఆమెకు రాజకీయ వైరం ఉంది గనుకనే ఆమె పిటిషన్ వేశారని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆమె పిటిషన్ను కొట్టేసింది. అయినా అక్కడితో ఆగకుండా లక్ష్మీ పార్వతి సుప్రీంకోర్టుకి వెళ్ళి మరోసారి మొట్టికాయలు వేయించుకొని నవ్వులపాలయ్యారు.
అసలు ఆమెకు చంద్రబాబు నాయుడిపై ఎందుకు పగ బట్టారు?ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్నారు?అని ఆలోచిస్తే, స్వర్గీయ ఎన్టీఆర్ ద్వారా ఆయన కుటుంబంలోకి ప్రవేశించిన ఆమె ఆయన కుటుంబ సభ్యులను, ఎన్టీఆర్ ఆస్తులను, టిడిపిని తన చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆమెను దూరంగా ఉంచగా, చంద్రబాబు నాయుడు వలన టిడిపి ఆమెకు వశం కాలేదు. అందుకే చంద్రబాబు నాయుడిపై ద్వేషంతో రగిలిపోతున్నారు. టిడిపిని, చంద్రబాబు నాయుడిని అమితంగా ద్వేషించే వైసీపీ లక్ష్మీ పార్వతికి రాజకీయ ఆశ్రయం కల్పించడంతో ఈవిదంగా కుటిలయత్నాలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు.



