ప్రతీ మనిషికీ ఎప్పుడో అప్పుడు తప్పక ఓ అవకాశం లభిస్తుంది. ఆలాగే లక్ష్మీపార్వతికి కూడా. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతినాడు ఆ సమయం లభిస్తుంటుంది. అయితే ఆమె ఆ రోజున ఎన్టీఆర్కు నివాళులు అర్పించకపోయినా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరిలను తప్పకుండా పేరుపేరునా తిట్టిన తిట్టు తిట్టకుండా వారి పట్ల తన మనసులోని కోపాన్ని, ద్వేషాన్ని వెళ్ళగక్కుతుంటారు.
ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కనుక మళ్ళీ ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సమయం ఇది. ఈసారి తన జాబితాలో నారా లోకేష్ పేరును కూడా చేర్చి అందరినీ కసితీరా తిట్టిపోసారు.
నారా లోకేష్ ఎందుకు పనికి రాని సన్యాసి, చదువు, పెద్దలని గౌరవించే సంస్కారం లేని వెదవ… అలాంటి వాడిని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసేందుకు ఆరాటపడుతున్నాడు. వీళ్ళందరి వలన నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. రాష్ట్రం కూడా నాశనం కాకూడదనే నా బాధ అంతా… అంటూ వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.
ఆమె జగన్మోహన్ రెడ్డిని పొగిడే ఉత్సాహంలో ‘ఆయన సొంత కుటుంబం…’ అంటూ ఏదో చెప్పబోయారు. ఆమె జగన్ కుటుంబం గురించి మరో ముక్క నోరు జారి ఉంటే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల గురించి మాట్లాడవలసి వచ్చేది. కానీ తమాయించుకుని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను, మహిళలను అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లా జగన్ ఆదరిస్తున్నారని సర్ధి చెప్పారు.
ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేశారని వాదిస్తున్న లక్ష్మీపార్వతి, జగన్మోహన్ రెడ్డిని కూడా తల్లి, చెల్లికి ఎందుకు అన్యాయం చేస్తున్నావని ప్రశ్నించి ఉంటే బాగుండేది కదా? వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఎందుకు వెనకేసుకువస్తున్నావని, సునీతారెడ్డిని ఎందుకు ముప్పతిప్పలు పెడుతున్నావని అడిగి ఉంటే బాగుండేది కదా?
నారా లోకేష్కు చదువు, సంస్కారం లేవని విమర్శిస్తున్న లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ని వాడూ వీడూ అంటూ సంభోదించడం, పనికిరాని వెదవలు అంటూ చులకనగా మాట్లాడటాన్ని ఏమనుకోవాలి?అయినా నారా లోకేష్ చదువు, సంస్కారానికి లక్ష్మీ పార్వతి సర్టిఫికేట్ అవసరమా?
ఒకవేళ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంత దుష్టులు, దుర్మార్గులే అయితే ప్రజలే వారిని తిరస్కరిస్తారు కదా?ఆమె ఎంతో పొగుడుతున్న జగన్ ‘బటన్ నొక్కుడు సభలకు’ లబ్ధిదారులు కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ జిల్లా పర్యటనలకు వస్తే ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారంటే అర్దం ఏమిటి?
లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ చేతిలో నుంచి టిడిపిని తీసుకొని చక్రం తిప్పుదామని ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు నాయుడు ఆమెను అడ్డుకున్నారని అందరికీ తెలుసు. అందుకే ఆమె ఏటా ఈ రెండు రోజులు తన ఆక్రోశాన్ని ఈవిదంగా వెళ్ళగక్కుతుంటారని అందరికీ తెలుసు.




