సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేయడం, పార్టీ లు స్థాపించడం, విరమించుకోవడం,విలీనం చేయడం, అధికార పీఠం ఎక్కడం దక్షిణాదిన కొత్తేమీ కాదు. ఆ నాటి ఎంజీఆర్, ఎన్టీఆర్ నుండి ఈనాటి మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి, తమిళనాట శరత్ కుమార్, విజయ కాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇలా ఎందరో వెండి తెర హీరోలు రాజకీయాల పై ఆసక్తి చూపారు.
అయితే వీరిలో కొంతమంది రాజకీయాలలో ఇమడలేక తనకు ఇంతటి పేరు, గుర్తింపు , అభిమానాన్ని తెచ్చిపెట్టిన సినీ రంగానికే తిరిగి వెళ్లిపోయారు. అందులో తెలుగు సినీ దిగ్గజమైన మెగా స్టార్ ఒకరైతే తమిళ నాటే కాకుండా ఎవత్ సినీ ప్రచంచంలోనే అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రాజనీకాంత్ మరొకరు.
2008 లో “ప్రజారాజ్యంతో” తెలుగు ప్రజల ముందుకు వచ్చిన చిరు 2012 లో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కొన్నాళ్లకు రాజకీయాలకు దూరమయ్యి సినీ రంగానికి చేరువయ్యారు. అలాగే కమల్ హాసన్ కూడా 2018 లో “మక్కల్ నీది మైయమ్” అనే పొలిటికల్ పార్టీని స్థాపించినప్పటికీ దానిని ముందుకు తీసుకెళ్లడంలో కమల తడబడ్డారనే చెప్పాలి.అదే కోవలో రజనీకాంత్ కూడా ఉన్నారు.
తమిళనాట మంచి రాజకీయ మార్పు రావాలని కోరుకుంటున్నా అంటూ తన రాజకీయ ప్రవేశం పై ప్రకటన చేశారు సూపర్ స్టార్.అభిమాన సంఘాలతో చర్చలు, సమావేశాలు జరిపి పార్టీలో సభ్యత్వానికి ఒక యాప్ కూడా డిజైన్ చేసిన రజనీకాంత్ తన వయస్సు, అనారోగ్య కారణాలతో రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అంటూ ప్రకటించడంతో ఒక్కసారిగా రజని అభిమానులు నిరాశకు లోనయ్యారు.
తాజాగా రజనీకాంత్ సతీమణి లతా ఒక టీవీ ఇంటర్ వ్యూలో మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల నుండి వెనుతిరగడం తనను ఎంతగానో బాధించిందని చెప్పుకొచ్చారు. ఆయన ఆ నిర్ణయం తీసుకోకుంటే రాజకీయాలలో ఒక సూపర్ పవర్ గా ఎదిగేవారంటూ తన అభిప్రాయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజల మన్ననలు పొందలేని స్టార్ హీరోలను చూసిన రజని తనకు ఇటువంటి పరిస్థితి వస్తుందేమో అని ఆలోచించే రాజకీయాల నుండి వెనకడుగు వేసుంటారని చెప్పుకుంటారు రజని సన్నిహితులు.
ఏదేమైనా రాజకీయాల నుండి విరమించుకున్న రజని రాజకీయ శత్రువులను లేకుండా చేసుకుని సినీ అభిమానులను పెంచుకుంటూ పోతున్నారు. ఇంతటి స్టార్ హోదా సంపాదించుకున్నప్పటికీ రజనికాంత్ చివరికి తన భార్యకు నిరాశనే మిగిల్చారా అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు ఇంటర్వ్యూ చూసిన ప్రేక్షకులు.




