రాయలసీమ ఫ్యాక్షన్ నాయకుడు మద్దెలచెరువు సూరి హత్యకేసులో తుది తీర్పు కాసేపటి క్రితం వెలువడింది. కోర్టు ప్రధాన నిందితుడు భాను కిరణ్ కు జీవిత ఖైదు విధించింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడైన సూరి… 2011, జనవరి 4న తన అనుచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్లో సూరితో పాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూసుఫ్గూడ ప్రాంతంలో దేశవాళీ తుపాకీతో కాల్చి ఆయన్ని చంపి పరారయ్యాడు.
[m9ad]
ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ 2012, ఏప్రిల్ 21న జహీరాబాద్ వద్ద భానుకిరణ్ను అరెస్ట్ చేశారు. ఇటీవలే ఆయనకు ఇల్లీగల్ గా మారణాయుధాలు కలిగి ఉన్న కారణంగా ఏడాది పాటు జైలు శిక్ష విధించింది ఒక కోర్టు. ఇప్పుడు ఏకంగా జీవిత ఖైదు విధించింది కోర్టు. 2012లో పట్టుబడిన నాటి నుండి బెయిల్ కోసం నిందితుడు ప్రయత్నించినా అతనికి ఉన్న నేరచరిత్ర వల్ల బెయిల్ దొరకలేదు. అప్పటి నుంచి భాను జైల్లోనే ఉన్నాడు.
తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు సూరి తన అనుచరుడి చేతిలోనే హతమవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే పరిటాల కుటుంబమే భాను కిరణ్ తో ఈ హత్య చేయించిందని సూరి భార్య భానుమతి ఆరోపించారు. ఆ కోణంలో ఈ కేసును విచారించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ తీర్పుపై భాను కిరణ్ హై కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అక్కడ ఓడిపోతే సుప్రీమ్ కోర్టుకు కూడా వెళ్ళవచ్చు. దీనితో ఈ కేసు ఇప్పట్లో తేలే అవకాశం లేదు.



