‘ఫ్రీడమ్ 251’ పేరుతో ఒక స్మార్ట్ మొబైల్ ను ఈ నెల 30వ తేదీ నుండి డెలివరీ చేయనున్నామని ప్రకటించిన రింగింగ్ బెల్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం నాటి నుండి డెలివరీ చేయలేకపోతున్నామని, జూలై 7 నుండి మొబైల్స్ ను అందజేస్తామని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు అప్పాయింట్మెంట్ అడగగా, అది ఇంకా దొరకలేదని, అందుకే డెలివరీ చేయట్లేదని సంస్థ వ్యవస్థాపక సీఈఓ మోహిత్ గోయల్ వివరణ ఇచ్చుకున్నారు.
ప్రస్తుతం తమ వద్ద 2 లక్షల ఫోన్లు ఉన్నాయని, మేకిన్ ఇండియాలో భాగంగా దేశవాళీ స్మార్ట్ ఫోన్ వ్యవస్థను మరో మెట్టు ఎక్కించాలన్నదే తమ ఉద్దేశమని, వారం రోజుల ఆలస్యంగా డెలివరీ ప్రారంభమవుతుందని, ఈ లోగా ప్రధానిని కలుస్తామని సీఈఓ తెలిపారు. తొలి దశ డెలివరీల తరువాత మరోసారి బుకింగ్స్ స్వీకరిస్తామని, తాము చేసిన తప్పేంటో తెలుసుకున్నామని, ఇకపై సైలెంటుగా ఉండి సంస్థను ముందుకు నడిపిస్తామని అన్నారు. అయితే ఇప్పటివరకు అందరి మదిలో దాగి ఉన్న ఓ సందేహానికి సమాధానం కూడా లభించింది.
251 రూపాయలకు మొబైల్ అమ్మితే సదరు సంస్థకు ఎంత లాభం వస్తుంది? అసలు లాభం వస్తుందంటారా? ఈ మొబైల్ ప్రకటించిన నాటి నుండి అందరినీ తలచివేసిన ప్రశ్న ఇది. అయితే దీనికి సమాధానం ఇచ్చిన సీఈఓ ఒక్కో మొబైల్ పై 140 నుంచి 150 రూపాయల మేర నష్టం మిగలనుందని, ప్రస్తుతం ఇలా ఉన్నా… ప్రొడక్షన్ పెరిగే కొద్దీ లాభాల్లోకి వెళ్లగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు గోయల్.



